హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హరితనిధి (తెలంగాణ గ్రీన్ఫండ్)కు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హరితనిధి కార్యకలాపాలను మరింత మెరుగుపరచటం కోసం 2021 అక్టోబర్ 1న ‘గ్రీన్ ఫండ్’ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు హరితనిధి (గ్రీన్ ఫండ్) విధివిధానాలను సవరిస్తూ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ హరితనిధి ఫండ్కు బదులు తెలంగాణ హరితనిధి సొసైటీగా సవరిస్తూ నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
హరిత సొసైటీ పాలకవర్గం
సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సొసైటీ పాలకవర్గం చైర్మన్గా రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ చైర్మన్గా, సభ్యకార్యదర్శిగా పీసీసీఎఫ్ (హెచ్వోఎఫ్ఎఫ్), పీసీసీఎఫ్, పీసీసీఎఫ్ (కంపా), ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యనిర్వాహక కమిటీకి చైర్మన్గా అటవీశాఖ స్పెషల్ సీఎస్, పీసీసీఎఫ్ అండ్ హెచ్వోఎఫ్ఎఫ్ సభ్యకార్యదర్శిగా, సభ్యులుగా పీసీపీఎఫ్/అడిషనల్ పీసీసీఎఫ్, హరితనిధి సొసైటీ ఇన్చార్జ్ అధికారి, పీసీసీఎఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉంటారని శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.