హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.89 లక్షల విద్యార్థులకు స్నాక్స్ను సమకూర్చేందుకు రూ.9.67 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రభుత్వ బడుల విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను రోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నారు. వీరికి మధ్యాహ్నం భోజనం పెడుతారు. సాయంత్రం విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జిల్లా పరిషత్తు, ప్రభుత్వ మాడల్ బడుల్లో స్నాక్స్ అందజేతకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు మొత్తం 34 రోజుల పాటు స్నాక్స్ను సమకూరుస్తారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఖాతాలకు జమ చేస్తారు. ఆయా నిధులతో మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా స్నాక్స్ అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. స్నాక్స్ అందజేతకు రూ. 9.67 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాయి. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, పధాన కార్యదర్శి చావ రవి, సీపీఎస్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధానకార్యర్శి చీటి భూపతిరావు, పీఆర్టీయూ తెలంగాణ నేతలు ఎం చెన్నయ్య, మారెడ్డి అంజిరెడ్డి, హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ప్రభుత్వ చొరవను అభినందించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ -2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.