హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ట్రిబ్ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసి, ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేసిన తరువాతే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ నెల 13న ప్రజాభవన్కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వెయ్యికిపైగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ యాజమాన్యాల కింద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇతర (జనరల్, బీసీ, మైనార్టీ) గురుకులాల్లో 2018, 2019లో ఉద్యోగంలో చేరిన వారికి కూడా పదోన్నతులు లభించాయి. అయితే ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులకు చాలాకాలంగా ప్రమోషన్లు లభించలేదు.
బదిలీలు చేపట్టకపోవడంతో ఏండ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్నారు. కొత్తగా నియామకాలు పొందేవారు విధుల్లో చేరితే దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెరుగైన ప్రాంతాలను కోల్పోనున్నారు.
అంతేకాకుండా సుదీర్ఘ సర్వీస్ కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కొత్తగా నియామకం పొందనున్న వారికంటే జూనియర్గా పరిగణన పొందే ప్రమాదం ఉన్నది. దీనితోపాటు 317 జీవోకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆయా సమస్యలను పరిష్కరించకుండా, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకుండా ప్రభుత్వం ఇప్పుడు ట్రిబ్ ద్వారా కొత్త నియామకాలు చేపట్టడంపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జేఏసీ ఏర్పాటు
ట్రిబ్ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకులాల్లోని అన్ని సంఘాలు కలిసి ఇటీవల కార్యాచరణను ప్రకటించాయి. ఈ సమావేశానికి టిగారియా సెంట్రల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి నారాయణ, మధుసూదన్, స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీ కృష్ణారెడ్డి, ప్రభుదాస్, టీటీఆర్ఈఐటీఏ అధ్యక్ష, కార్యదర్శులు రుషికేశ్కుమార్, కల్యాణి, ట్రీస్ అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్, సత్యం, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీ చలపతి, వివేకానంద, టిగారియా డిగ్రీ కాలేజీ యూనిట్ బాధ్యులు శారద, సత్యశ్రీదేవి, ఎస్సీ సొసైటీ బాధ్యులు నర్సింలుగౌడ్, గణేశ్, టీ గురుకులం బాధ్యులు శ్యాంకుమార్, ముతయ్య, స్పెషల్ టీచర్స్ అధ్యక్షుడు వేదాంతచారి తదితరులు పాల్గొని ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్టు తీర్మానించారు.
డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం అన్ని పాఠశాలలు, కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, మంగళవారం ఉదయం 6 గంటలకు జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ వద్దకు గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాలు అందజేయాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణను అదేరోజు ప్రకటించాలని నిర్ణయించారు.
రిక్రూట్మెంట్కు ముందే పదోన్నతులు కల్పించాలి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించిన తరువాతే కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే డిమాండ్ల సాధనకు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పదోన్నతులు కల్పించకుండా రిక్రూట్మెంట్ను చేపడితే సీనియర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.