Medaram Jathara | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర నిర్వహణలో సర్కారు వైఫల్యం స్పష్టమైంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా భక్తులు తీవ్ర అసహనానికి గురైన పరిణామాలే ప్రభుత్వ వైఫల్యాన్ని తేల్చి చెప్తున్నాయి. ఈనెల 21 నుంచి 24 వరకు ములుగు జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ విషయంలో సర్కారు మొదటి నుంచి శీతకన్ను వేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నిరుటి వరకు నిర్వహించిన ఏ జాతరలోనూ (2004లో మినహాయించి) జరగనంత అసౌక ర్యం ఈసారి జరిగిందని భక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జాతర నిర్వహణలో శాఖలు వేటికవే నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించాయి తప్ప బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ గద్దెల ప్రాంగణంలో హుండీలు పెట్టేందుకు చూపిన శ్రద్ధలో కనీసం పదోవంతు భక్తులకు బంగారం (బెల్లం) ప్రసాదం అందజేసే విషయంలో చూపలేదని ఆగ్రహం వెల్లువెత్తింది.
చేతులెత్తేసిన పోలీసులు
జాతర నిర్వహణలో పోలీసుశాఖ ఒంటెద్దు పోకడలు, ఆధిపత్య ధోరణితో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సకల శాఖల అధికారులను హూంకరిస్తూ తమవారినే దర్శనానికి అనుమతిస్తూ సాధారణ భక్తులను, పోలీసుశాఖే జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు ఉన్న భక్తులనూ దర్శనానికి అనుమతించలేదనే అపవాదును ఆశాఖ మూటగట్టుకున్నది. సీఎం, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రుల దర్శనాలు మినహా ఇతరును పూచికపుల్లలా తీసిపారేశారని విమర్శలను ఎదుర్కొన్నారు. ఓ ఐపీఏస్ అధికారి ఒక సీఐపై చేయి చేసుకోవడంతో ఉన్నతాధికారుల తీరుపై విస్మయం వ్యక్తమవుతున్నది.
గంటలకొద్దీ ట్రాఫిక్జామ్
రెండు దశాబ్దాల అనంతరం తిరిగి మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్య పునరావృతమైంది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువైన రోజైన ఈ నెల 22 నుంచి శనివారం వరకు ఈ సమస్య కొనసాగింది. తల్లుల దర్శనానికి పోలీసులే పోటీపడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2004 నాటి ట్రాఫిక్ సమస్యను భక్తులు గుర్తుచేసుకోవడం గమనార్హం. పస్రా-తాడ్వాయి మధ్య 23 నుంచి 24 వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సులు రాక మేడారం బస్స్టేషన్లో భక్తులు గంటల కొద్దీ నిరీక్షించారు. ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లు సైతం భక్తుల ఆగ్రహానికి వేదికయ్యాయి. అధికారులే భక్తులకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈనెల 23న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ముండా సహా ఇతర ప్రముఖుల దర్శనం కోసం గంటలకొద్దీ సాధారణ భక్తుల దర్శనాన్ని నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
భక్తుల ఆగ్రహాన్ని చవిచూసిన సీఎం
సీఎం రేవంత్రెడ్డి మేడారంలో భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. ఈనెల 23న సమ్మక్క-సారలమ్మను సీఎం రేవంత్ దర్శించుకున్నారు. ఈ సమయంలో మేడారం హెలిప్యాడ్ నుంచి తల్లుల దర్శనానికి వస్తున్న క్రమంలో సాధారణ భక్తులను దర్శనానికి పంపకుండా క్యూలైన్లలో నిలిపి ఉంచారు. ఈ అసౌకర్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు సీఎం డౌన్ డౌన్.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వాటిని పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రులు వెళ్లిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.