జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యటించారు. చిన్నారులకు దుస్తులు, లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం కేసీఆర్ గ్రామీణాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సీసీ రోడ్లు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలు ఇలా అనేక అభివృద్ధి పనులు గ్రామాల్లో కొనసాగుతున్నాయన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.