మెదక్ : తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం పోచారం చెరువులో 6 లక్షల 28 వేల రొయ్యలు ,12 లక్షల 48 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్య కారుల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.
మత్స్యకారులకు ఉచితంగా కట్ల, రవ్వు, బొచ్చ వంటి పెంపకానికి అనువుగా ఉన్న చేప పిల్లలను అందజేస్తున్నదని తెలిపారు. రాబోయే కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనోత్త్పత్తి చేసి ఇక్కడే చేప పిల్లలను చెరువులో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. గతంలో మత్స్య సంపద ఆంధ్రాలోనే ఉండేదన్న భావనను తొలగించారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చొరవతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసి వర్షపు నీటిని ఒడిసి పట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపడం ద్వారా మత్స్య సంపదను పెంచి చరిత్రను తిరగ రాశారని అన్నారు. జిల్లాలో ఘనపూర్, కొంటూర్, హల్దీ వాగు వంటి చెరువులతో పాటు చెక్ డ్యామ్ లు ఉన్న దగ్గర 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలను పెంచుతున్నారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు రజిని, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.