జనగామ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు, అధికారులు ప్రచారంలో పాల్గొనకూడదు.
గురువారం తన భార్య,బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూపను గెలిపిస్తే 16వ వార్డు ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని డాక్టర్ భిక్షపతి తాయిళాలు ప్రకటిస్తూ ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొంటున్న డాక్టర్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.