హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ను తలదన్నేలా అఫ్జల్గంజ్లోని ప్రభుత్వ దంత వైద్యశాల సేవలు అందిస్తున్నది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఈ దవాఖానలోని ప్రత్యేక విభాగంలో అత్యుత్తమ వైద్యసేవలు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఈ విభాగాన్ని సందర్శిస్తే ప్రభుత్వ దవాఖానకు వెళ్లిన ఫీలింగ్ ఏమాత్రం కలగదు. కార్పొరేట్ దవాఖానకు వచ్చామా? అన్న అనుభూతి కలుగుతుంది.
నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు పరిశుభ్రతను పాటించడం ఈ విభాగం ప్రత్యేకత. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి దంత సమస్యలు ఉన్నవారు ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులతోపాటు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ వైద్యశాలను ఆశ్రయిస్తుండటం ఇక్కడ లభిస్తున్న ఉత్తమ వైద్యసేవలకు నిదర్శనం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సైతం ఈ దవాఖానలో చికిత్స పొందడం విశేషం. సాధారణంగా ఇతర దవాఖానల్లో ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డుదారులకు రిజిస్ట్రేషన్ కౌంటర్ మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. డాక్టర్ కన్సల్టేషన్, వైద్యపరీక్షలు, చికిత్స తదితర సేవలన్నీ సాధారణ రోగులతోపాటే క్యూ పద్ధతిన పొందాల్సి ఉంటుంది. కానీ అఫ్జల్గంజ్ దంత వైద్యశాలలో తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ప్రత్యేకంగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సాధారణ రోగుల మాదిరిగా డాక్టర్ కన్సల్టేషన్, వైద్యపరీక్షలు, చికిత్స కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవస్థ తప్పింది. ఈ ప్రత్యేక విభాగంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ప్రత్యేక విభాగం ద్వారా ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఓపీ సేవలతో పాటు చికిత్స పొందుతున్నారని విభాగం ఇన్చార్జి డాక్టర్ హర్షియా సనోబర్ తెలిపారు. రూట్కెనాల్, క్లిప్పింగ్, ప్లేటింగ్, బ్రేసెస్ తదితర చికిత్సల కోసం పేషెంట్లకు అనుకూలమైన తేదీల్లో అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రతి నెలా సుమారు రూ.10 లక్షల విలువైన డెంటల్ ఇంప్లాంట్స్తో కార్డుదారులకు పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డుదారులకు ఖరీదైన డెంటల్ ఇం ప్లాంట్స్ను పూర్తి ఉచితంగా అందజేస్తు న్నాం. ఈ విభాగం లో 6డెంటల్ చైర్స్ ఉన్నాయి. 14 మంది రెసిడెంట్ డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. ఓపీకి వచ్చిన వారికి వైద్యపరీక్షలు చేసి, ట్రీట్మెంట్ అదేరోజు అందిస్తున్నాం. రూట్కెనాల్, క్లిప్పింగ్, ప్లేటింగ్ వంటి ఇంప్లాంట్స్ వేయాల్సినవారికి మాత్రం డేట్స్ ఇస్తాం.
– డాక్టర్ అర్షియా, ఈహెచ్ఎస్,జేహెచ్ఎస్ విభాగం ఇన్చార్జి
డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రోజూ 700 నుంచి 800 మందికి చికిత్స అందిస్తున్నాం. పొరు గు రాష్ర్టాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్క్యాంప్లు నిర్వహిస్తున్నాం. స్క్రీనిం గ్ టెస్టులు చేసి, అక్కడే చికిత్స అందిస్తు న్నాం. తీవ్రమైన సమస్యలు ఉంటే దవాఖానకు రప్పిస్తున్నాం. కార్పొరేట్ తరహా సేవలు లభిస్తుండటంతో వీఐపీ, వీవీఐపీలు సైతం ఈ హాస్పిటల్కు వస్తున్నారు.
– డాక్టర్ జగదీశ్వర్రావు, ఆర్ఎంవో, ప్రభుత్వ దంత వైద్యశాల