హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): వైరస్ సోకిన వారిలో 93% మంది హోం ఐసొలేషన్లోనే కోలుకుంటున్నారని ఉస్మానియా మెడికల్ కళాశాల పల్మనాలజీ విభాగం ప్రొఫెసర్, ప్రభుత్వ చెస్ట్ దవాఖాన వైద్యుడు డాక్టర్ ప్రమోద్కుమార్ పేర్కొన్నారు. ఇంట్లో ఉంటూనే కరోనా చికిత్స పొందుతున్న వారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలని, నిర్లక్ష్యం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాధారణ జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉన్నవారికి హోం ఐసొలేషన్ సరిపోతుంది. వ్యాధి తీవ్రత ఉన్నవారు, వయసు పైబడిన వారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారు, ఇతర వ్యాధులు ఉండి, మోడరేట్, క్రిటికల్ దశలో ఉన్నవారిని తప్పనిసరిగా దవాఖానలో చేర్పించాలి.
హోం ఐసొలేషన్లో ఉండేవాళ్లు ఆక్సీమీటర్, థర్మామీటర్ దగ్గర ఉంచుకోవాలి. రోజుకు నాలుగైదుసార్లు ఆక్సిజన్, జ్వరం లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్ 93కు తగ్గినా, టెంపరేచర్ వంద దాటినా హాస్పిటల్కు వెళ్లాలి. ఐసొలేషన్లో ఉన్నవారు డాక్టర్తో మాట్లాడి, తగిన మందులు వాడాలి.. అవసరమైతే సీపీబీ, పీఆర్సీ, ఎల్డీహెచ్, పెర్రిటిస్ అనే నాలుగైదు టెస్టులు చేయించుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ గానీ, స్టెరాయిడ్స్ గానీ డాక్టర్ల సలహాతోనే వాడాలి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల షుగర్ కూడా పెరుగుతుంది. డాక్టర్ సూచనతో షుగర్ డోస్ను కూడా పెంచుకోవాలి. ఐసొలేషన్లో కోలుకున్న వారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు.
ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉండాలి. మంచం నుంచి దిగినా, గది నుంచి బయటకు వచ్చినా మాస్క్ ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తాము తాకిన వస్తువులను తామే శుభ్రం చేయాలి. ధూమపానం మానేయాలి. తమ దుస్తులను డెటాల్వేసి అరగంట సేపు వేడి నీటిలో నానబెట్టి ఉతికి, ఎండలో ఆరబెట్టాలి.
ఇంట్లో చికిత్స పొందుతున్న వారంతా పౌష్టికాహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. అనవసరంగా భయపడొద్దు. భయం, ఆతృత మన రోగ నిరోధకశక్తిని దెబ్బతీస్తాయి. ఆక్సిజన్ లెవల్స్ను కూడా తగ్గిస్తాయి. బ్రౌన్ రైస్, గోధుమపిండి, ఓట్స్, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయల్లో క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, బీన్స్, చిక్కుడు వంటివి తరచూ తీసుకోవాలి. నిమ్మ, బత్తాయిలో సీ విటమిన్ లభిస్తుంది. చికెన్, చేపలు, గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది.
బాధితునికి సహాయం చేసేవారు గదిలోకి వెళ్లినపుడు మూడు పొరల మెడికల్ మాస్క్ ధరించాలి. వెళ్లేటప్పుడు, ఆ తర్వాత చేతులను సబ్బుతో నిమిషంపాటు రుద్దిరుద్ది కడగాలి. రోగి వాడిన బెడ్షీట్, టవల్, పళ్లెం, గిన్నెలు, గ్లాసులను వేరుగా ఉంచడంతోపాటు వాటిని 30 నిమిషాలపాటు వేడి నీటిలో ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసి వాడాలి. రోగికి ఆహారాన్ని వారు ఉంటున్న గదిలోనే అందించాలి.