హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : హామీలు నెరవేర్చాలని నిరసనకు దిగిన వారిపై కాంగ్రెస్ సర్కార్ నిర్బంధానికి దిగింది. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ జారీ చేసి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్వీ నేతలను కట్టడి చేసేందుకు ఖాకీలను ప్రయోగించింది. ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్లు చేసింది. నిర్బంధాలను ఎదిరించి అసెంబ్లీకి చేరుకున్న విద్యార్థి నేతలపై లాఠీలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డ ది. శాసనసభ ఎదుట గల మహాత్ముడి సాక్షిగా దాడులకు దిగి నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. బలవంతంగా ఈడ్చిపడేసి పోలీసు వాహనా లు, వ్యాన్లలో ఎక్కించి నాంపల్లి, పంజాగుట్ట ఠాణాలకు తరలించింది.
పింఛన్ రూ.6వేలకు పెంచాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేయాలనే ప్రభుత్వానికి విన్నవించేందుకు వచ్చిన ది వ్యాంగులపై సైతం పోలీసులు జులుం ప్రదర్శించారు. గేటు బయటే అడ్డుకున్నారు. సీఎం, మంత్రులకు వినతిపత్రం ఇస్తామని ప్రాధేయపడ్డా కనికరించలేదు. బలవంతంగా వారిని వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచని స్థితి లో వారు నడిరోడ్డుపై బైఠాయించారు. అక్కడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముంద ర ఇచ్చిన హామీలు, ఎగ్గొడుతున్న తీరును ఎండగట్టారు. సర్కార్ జులుం నశించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడడంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొన్నది. మోసం చేసిన సర్కార్ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓట్ల కోసం దగా చేసిన కాంగ్రెస్కు ఓటుతోనే తగిన బుద్ధి చెబుతామని తేల్చిచెప్పారు.
అసెంబ్లీ ముట్టడి విజయవంతం
నిర్బంధాలు విధించినా, మొన్న రాత్రి నుంచే విద్యార్థి నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి విజయవంతమైంది. విద్యార్థి నేతలు పెద్దసంఖ్యలో శాసనసభ ఆవరణకు చేరుకున్నారు. మెడలో గులాబీ జెండాలు ధరించి నిరసనకు దిగారు.
రేవంత్ రాజీనామా చేయాలి: గెల్లు శ్రీనివాస్
విద్యాకమిషన్ సిఫార్సులకు కూడా కాం గ్రెస్ విలువ ఇవ్వలేదని గెల్లు శ్రీనివాస్ యాద వ్ ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలు రూ.10 వేల కోట్లు ఉంటే బడ్జెట్లో కేవలం 4కోట్లే కేటాయించి విద్యార్థులను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. విద్యానిధి ఊసేలేకపోవడం.. 5లక్షల భరోసా కార్డుల ప్రస్తావన తేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రా హుల్, ప్రియాంక హామీలకు విలువ ఇవ్వని రేవంత్ రాజీనామా చేయాలన్నారు.
ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసు లు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులను సోమవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్క డ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట, ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట, కామారెడ్డిలో విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్వీ నాయకుడు పొన్నం అనిల్కుమార్గౌడ్ను అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బె ల్లంపల్లి, నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, రాంపూర్లోనూ బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేశారు.