హుస్నాబాద్, జూలై 31: హుస్నాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ పంపుహౌస్లో మూడు మోటర్లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ కృషితో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కల నెరవేరిందన్నారు. కుర్చీ వేసుకొని దగ్గరుండి రిజర్వాయర్ పూర్తి చేయిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి వందశాతం నెరవేర్చారని ఆనందం వ్యక్తంచేశారు.
కొన్ని సాంకేతిక కారణాలు మినహా రిజర్వాయర్ దాదాపు పూర్తయిందని చెప్పారు. గౌరవెల్లి రిజర్వాయర్తో నియోజకవర్గంలోని లక్షా ఆరు వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం మరో కోనసీమగా రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రిజర్వాయర్ను పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాత్రింబవళ్లు పనిచేసి పంపుహౌజ్ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్న్ విజయవంతం చేసిన ఇంజినీరింగ్ అధికారులకు అభినందించారు.
ప్రాజెక్టులకు స్థిరంగా వరద
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో గోదావరి, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శనివారం 37 వేల ఇన్ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి స్వల్పం గా పెరిగి 38 వేల క్యూసెక్కులకు చేరుకొన్నది. అంతే మొత్తాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు లక్ష క్యూసెక్కుల ప్ర వాహం ఉన్నది. నిజాంసాగర్, శ్రీరాజరాజేశ్వర జలాశయం, ఎల్ఎండీ, కడెం ప్రాజెక్టులతోపాటు పార్వతి, సరస్వతి, లక్ష్మీ, సమ్మక్క బరాజ్ల వద్ద కూడా వరద పెరుగుతున్నది. ఇక కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. శ్రీశైలం డ్యామ్కు శనివారం సాయంత్రానికి 52 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పెరిగిపోయింది. నాగార్జునసాగర్లో నీటి మట్టం 555 అడుగులకు చేరింది.