Gopi Reddy | దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఉద్దేశించి మాట్లాడుతూ.. డీజీపీ అంజనీకుమార్ యాదవ్పై చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపీరెడ్డి ఖండించారు. గౌరవ ప్రదమైన చట్టసభలో సభ్యుడిగా ఉండి.. అభ్యంతరమైన భాష వాడడం హేయమన్నారు.
అరెస్టు నిబంధనలు పాటించకుండా ప్రశ్నించవచ్చని, కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. కానీ, ఆటవిక భాషను ఉపయోగించి అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీని అవమానకర, అభ్యంతరకర రీతిలో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్శాఖ అధిపతిని అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ సిబ్బంది మనోధైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు.
తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టసభ సభ్యుడిగా ఉండి, పోలీసు వ్యవస్థ, ఉన్నతాధికారులపై వ్యక్తిగత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు గోపీరెడ్డి తెలిపారు.