హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కొనుగోలుదారుల నుంచి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు ఏర్పాటైన ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తున్నది. డీలర్లు, దుకాణదారుల నుంచి సకాలంలో బకాయిలు వసూలయ్యేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017లో నాలుగు ప్రాంతీయ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల (ఎంఎస్ఈఎఫ్సీ)ను ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రానికి కొన్ని జిల్లాలను కేటాయించి పరిశ్రమల శాఖ సహాయ సంచాలకుడి స్థాయి అధికారిని నియమించడంతోపాటు ఆయనకు విస్తృత అధికారాలను (మెజిస్టీరియల్ పవర్స్) కల్పించింది. ప్రాంతీయ కౌన్సిళ్లను రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు.
గత నాలుగున్నరేండ్లలో ఈ కౌన్సిళ్లకు వచ్చిన 2,500 ఫిర్యాదుల్లో 900 పరిష్కారమయ్యాయి. మిగిలిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొనుగోలుదారుల నుంచి 45 రోజుల్లోగా బకాయిలు వసూలు కాకపోతే ఎంఎస్ఎంఈలు ఆన్లైన్లో నేరుగా ఈ కౌన్సిళ్లను ఆశ్రయించవచ్చు. దరఖాస్తు చేసుకొన్న 90 రోజుల్లోగా కేసు పరిష్కారమయ్యేలా చట్టంలో పటిష్ఠ నిబంధనలు పొందుపరిచారు. ఈ నిబంధనల ప్రకారం.. బయ్యర్ నిర్ణీత గడువులోగా ఎంఎస్ఎంఈలకు వడ్డీతో సహా బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను కౌన్సిల్ తీర్పుతో విభేదించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకొంటే బకాయి మొత్తంలో 75 శాతాన్ని కౌన్సిల్కు డిపాజిట్ చేసితీరాలి. లేనిపక్షంలో పైకోర్టుకు వెళ్లేందుకు వీలుండదు.
జిల్లాలవారీ ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు రంగారెడ్డి కలెక్టరేట్లో.
మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టరేట్లో.
వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కరీంనగర్ జిల్లా పరిశ్రమల కేంద్రంలో.
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు హనుమకొండ జిల్లా ఖాజీపేటలోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో.