హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3: దళితబంధు పథకం ద్వారా మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలు చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని ఇందిరానగర్, శాలపల్లి గ్రామాల పరిధిలో దళితబంధు పథకం కింద మహిళలు క్లాత్ క్యారీ బ్యాగ్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేశారు. మరో మహిళ ఐరన్, సిమెంట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలను వినోద్ కుమార్ సందర్శించారు. లబ్ధిదారుల వినూత్న ఆలోచనలకు, విభిన్న వ్యాపారాల దృక్పథాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలు చేసే విధంగా మహిళలు ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆశించిన మేరకు దళితబంధు పథకం సత్ఫలితాలనిస్తున్నదన్నారు. కూలీలు, జీతగాళ్లుగా ఉన్న దళిత బిడ్డలు.. దళితబంధు ద్వారా యజమానులుగా మారినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు.