హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్(Good News) చెప్పింది. మరో ఏడు జిల్లాల పేదలకు వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ బలవర్ధక(ఫోర్టిఫైడ్)బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula ) వెల్లడించారు. ఐరన్, ఫోలిక్యాసిడ్, విటమిన్ బి12లతో కూడిన బియ్యంతో సంపూర్ణ పోషణ ను అందించనున్నామని తెలిపారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు.
విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతో పాటు 7 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతీ రేషన్ కార్డుదారుకు బలవర్ధక బియ్యాన్ని(Fortified) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
2021 సెప్టెంబర్లో జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా మొదలైన బలవర్ధక బియ్యం పంపిణీ 2022 మే నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంపిణీ చేస్తుందన్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఏప్రిల్ నుంచి బలవర్ధక బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు. మిగతా జిల్లాల్లో సైతం విడతల వారీగా 2024 మార్చి వరకూ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందు కోసం రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లోనూ బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని వివరించారు. సీఎంఆర్లో భాగంగా 35 లక్షల మెట్రిక్ టన్నులు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించగా రాష్ట్ర ప్రజాపంపిణీ అవసరాల కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 11 లక్షల మెట్రిక్ టన్నులను ఇప్పటికే సేకరించిందన్నారు. కోట్ల రూపాయల అధనపు బారానికి వెరవకుండా సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారన్నారు.