హైదరాబాద్ : రాష్ట్రంలోని క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉప్పల్లో క్రైస్తవ భవనం కోసం రెండు ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షించారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
క్రిస్మస్ ముందే ఉప్పల్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని కొ ప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. అదే విధంగా క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సెబాస్టియన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజు సాగర్, మైనార్టీస్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, క్రిస్టియన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఏకే ఖాన్, క్రిస్టియన్ కమ్యూనిటీ నేతలు రాయడన్ రోస్, శంకర్ లోకు, మోహన్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.