హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది శుభవార్తే. ఒక కరువుభత్యం (డీఏ) విడుదలకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లించేందుకు అభ్యంతరం లేదని శనివారం ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఒక డీఏ విడుదలకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు సైతం ఈసీని కలిసి పెండింగ్ డీఏ విడుదలకు అనుమతినివ్వాలని కోరారు.
పలు కారణాలతో అప్పట్లో ఈసీ అనుమతినివ్వకపోవడంతో డీఏ విడుదలకు బ్రేక్ పడింది. పోలింగ్ పూర్తికావడం, ఓటర్లు ప్రభావితులయ్యే అవకాశం లేకపోవడంతో డీఏ విడుదలకు తాజాగా ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ విన్నపం మేరకు డీఏ విడుదలకు అనుమతినివ్వడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, టీజీవో అధ్యక్షప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని డీఏ విడుదల చేయాలని కోరారు.
23.66 శాతానికి డీఏ
ఈసీ అనుమతి నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే డీఏ 3.64శాతం పెరుగుతుంది. మూలవేతనంపై ప్రస్తుతం 20.02% డీఏ చెల్లిస్తుండగా, తాజా పెంపుతో డీఏ 23.66 శాతానికి చేరుతుంది. 6 నెలలకు ఒక డీఏను ప్రభు త్వం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విడుదల చేసే డీఏ 1-7-2022కు చెందినది. ఈసీ అనుమతితో డీఏను ప్రభుత్వం విడుదల చేస్తే జీపీఎఫ్ ఉన్న వారికి జీపీఎఫ్లో కలుస్తుంది. సీపీఎస్ ఉద్యోగులకు 10శాతం ప్రాన్ అకౌంట్కు, 90 శాతం ఎరియర్స్ను 8 సమాన వాటాల్లో అందజేస్తారు. డీఏ విడుదల ద్వారా రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు లబ్ధిపొందుతారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.