మెదక్ మున్సిపాలిటీ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం 3గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చర్చి బిషప్ రెవరెండ్ సాలోమాన్రాజ్ దైవసందేశం చేశారు. ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలిరావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది.