శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం
ఆయువుపట్టు.. కాళేశ్వరం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : సాగునీటి రంగానికి రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టికి, కార్యదక్షతకు రాష్ట్రంలో నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుధవారం విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. గత ఏడేండ్లలో ప్రభుత్వం 9 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి 21.32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ 1, 2 దశల కింద ఉన్న 13.20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. ఎస్సారెస్పీ కింద 9.68 లక్షలు, నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. నిర్మాణ పనులు కొనసాగుతున్న 24 మేజర్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 69.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 17.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. 663 చిన్న ఎత్తిపోతల పథకాల కింద 5.05 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 640 ఎత్తిపోతలను పూర్తి చేసి 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం 23 ఎత్తిపోతల పథకాల పనులు సాగుతున్నాయి. అవి పూర్తయితే మరో 0.46 లక్షల ఎకరాలకు నీరందుతుంది. మిషన్ కాకతీయ పథకంలో నాలుగు దశల్లో 27,665 చెరువులను పునరుద్ధరించి 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 27 మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మైనర్ ఇరిగేషన్లో 401 చెరువులతో మేడ్చల్ మల్కాజ్గిరి చివరిస్థానంలో ఉండగా, 2.936 చెరువులతో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది.