హైదరాబాద్ : యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి అద్భుతంగా బంగారు తాపడం చేయిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ తొలుత తన వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి ఆలయానికి పలువురు ప్రముఖులు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. బంగారం విరాళంగా ప్రకటించిన వారిలో కొందరు బంగారాన్ని నేరుగా అందజేస్తామని లేదా చెక్కు రూపంలో అందజేస్తామని ప్రకటించారు. అయితే ఈ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
మంగళవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ ‘స్వామివారి గర్భగుడిపైన ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం తిరుమలలో చేసిన వారిని మన అధికారులు సంప్రదించారు. అతి త్వరగా కావాలంటే కొంత తక్కువ బంగారంలో తొందరగా అవుతుందని, లేదు తిరుమల మాదిరిగానే.. అదే ప్రమాణాలతో కావాలంటే కొంత ఎక్కువ సమయం, ఎక్కువ బంగారం పడుతుందని వారు చెప్పారు. మేము తిరుమల మాదిరిగా కావాలె.. అవసరమైతే అంత కన్నా మంచిగ కావాలని చెప్పినం. దానికి వారు స్పందిస్తూ.. తమకు కొంత సమయం పడుతుందని చెప్పారు.
మీరు ఇక్కడే ఉండి మీ పర్యవేక్షణలో ఇక్కడే చేయమంటే ఇక్కడే చేస్తాం.. లేదంటే మరో రకంగా చేస్తామన్నారు. దీనికి వారు వేసిన బంగారం అంచనా. 125 కిలోలు. సంతోషంగా చేయించాలని నిర్ణయించాం. డబ్బు రూపంలో దాని విలువ చూస్తే రూ.60 కోట్ల దాకా అవుతుంది. ఇంత చేసిన వాళ్లం, ప్రభుత్వం అనుకుంటే చేయవచ్చు. కానీ, ఇటీవల శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ ప్రస్తావన తెచ్చా. వాళ్లేమన్నారంటే.. ‘యావత్ తెలంగాణ ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవాలనుకుంటరు. ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని ఇన్వాల్వ్ చేద్దాం’ అన్నరు. ప్రజలందరు తమదిగా భావించి, ఒక ఎమోషన్లో కదిలి వచ్చే ప్రయత్నం చేద్దామన్నరు.
కలిగిన వారు కలిగినంత ఇంత ఎక్కువ, తక్కువ అని లేదు. వ్యక్తులుగా ఇవ్వొచ్చు, గ్రామాలుగా ఇవ్వొచ్చు. మనకు 12,769 గ్రామ పంచాయతీలు, 3,600 పైచిలుకు మున్సిపల్ వార్డులు ఉన్నాయి. 142 మున్సిపాలిటీలు, హైదరాబాద్ వంటి మహానగరం ఉంది. మన వాళ్లు కోరింది ఏంటంటే.. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైంత వాళ్లు సమర్పించాలి. వీసమెత్తో, గుంజెత్తో.. పావుతులం అయినా ఫర్వాలేదు వాళ్లను ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ల వాళ్ల గ్రామాల్లో నృసింహ పూజ కార్యక్రమాలు చేసి డబ్బు రూపంలో తెచ్చి కమిటీ వారికి అప్పజెప్పాలి. ఈ బంగారం కూడా అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైన బంగారం కావాలి. సరైన పద్ధతిలో రావాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొనాలని నిర్ణయించాం. పిచ్చి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం లేదు. ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తే మనకు నిఖార్సయిన బంగారం లభ్యమవుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. కమిటీ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. అందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో ఉంటరు. తిరుమలలో ఎలా చేసుకున్నమో మనం అలా చేసుకున్నైట్లెతే అది శాశ్వతంగా, గొప్పగా ఉండిపోయే అవకాశం ఉంటుంది’ అని సీఎం చెప్పారు.
సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – 6 కిలోలు
ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు – 2 కిలోలు
జలవిహార్ రామరాజు – 1 కిలో
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి – 5 కిలోలు
మంత్రి మల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి – 2 కిలోలు
మంత్రి హరీశ్రావు – 1 కిలో
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవకొండ దామోదర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్కర్ రావు – 1 కిలో
జీయర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్యే బాల్క సుమన్ – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హనుమంతరావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
కడప వ్యాపారవేత్త జయమ్మ – 1 కిలో