Bhadrachalam | భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది. శనివారం ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే 3 వేలకుపైగా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీగా వరద ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.
కాగా, ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి గోదావరికి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గోదావారి ఉధృతితో ఖమ్మం, వాజేడు, చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తున్నది.
నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సూచనలిచ్చారు. వరద తగ్గాక అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.