భద్రాచలం : కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 70 అడుగులు దాటి పోయింది. నదీ ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని యువత అంటున్నారు.
కాగా, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారిగా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు.
నది తీవ్రరూపం దాల్చడంతో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో నివాసాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయం పరిసరాలు నీట మునిగాయి.. #Bhadrachalam #Godavari #Waterfloods pic.twitter.com/z8tM00h7pC
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022