1986, ఆగస్టు 16.. భద్రాచలం వద్ద గోదావరి 5.6 అడుగులకు చేరుకొన్నది. ఇప్పటిదాకా ఇదే రికార్డు.1990, ఆగస్టు 24.. 70.8 అడుగులకు గోదావరి ఎగిసెగిసి వచ్చింది. గోదావరి నీటిమట్టంలో ఇది రెండో రికార్డు..
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మొదటిసారి. ఎగువ నుంచి అతి తీవ్ర స్థాయిలో వరద ప్రవాహం భద్రాచలానికి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వస్తున్నది. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ నుంచే దాదాపు 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తున్నది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో శుక్రవారం ఉదయానికి భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటవచ్చని భావిస్తున్నారు. పవిత్రమైన భద్రాద్రి రామయ్య దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకున్నది. గోదావరి మహోగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో నదీతీర ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్నది. నదీతీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. మరోపక్క గురువారం రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు కమ్ముకొన్నా.. వాన గెరువిచ్చింది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: వాతావరణంలో వ చ్చిన మార్పుతో రాష్ర్టానికి అతిభారీ వర్షాల ప్రభావం తగ్గింది. వానలు తగ్గుముఖం పట్టినా.. అనేక గ్రామా లు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కడెం ప్రాజెక్టుకు ముప్పుతప్పింది. ఇన్ఫ్లోలు తగ్గినప్పటికీ.. 17 గేట్ల ద్వారా 1.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. శ్రీరాంసాగర్లోకి గురువారం 3.936 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. 36 గేట్లు ఎత్తి 2.99 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 52 గేట్ల నుంచి 11.47 లక్షల క్యూ సెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సాధారణ ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వరద తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చురుకుగా పాల్గొంటున్నారు. ముం పు బాధితులను రక్షించడానికి పునరావాస శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 19 వేల మందిని తరలించారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటానికి హెలికాప్టర్లను కూడా వాడుతున్నారు.
జలదిగ్బంధంలో మంచిర్యాల జిల్లా కేంద్రం; గురువారం పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్లు
భద్రాద్రిలో మహోగ్ర గోదావరి
భద్రాచలం వద్ద మహోగ్ర రూ పంలో ప్రవహిస్తున్న గోదావరి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. గురువారం సాయంత్రానికే నీటిమట్టం 62 అడుగులకు చేరుకొన్నది. దాదాపు 28 లక్షల క్యూసెక్కుల వరద నిరంతరంగా వస్తున్నది. శుక్ర వారం ఉదయం 70 అడుగులు దా టుతుందని అంచనా. భద్రాచలం బ్రిడ్జిపై 1986 తరువాత మళ్లీ గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సాయం త్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు వాహన, పాదచారుల రాకపోకలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీకి రవాణా స్తంభించింది. భద్రాచలంతోపాటు ఇతర ముంపు ప్రాం తాలకు ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. వరద పోటెత్తడంతో దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం ఆవరణలో కల్యాణ మండపం పూర్తిగా నీటమునిగింది. విద్యుత్తు సబ్స్టేషన్లోకి వరద చేరింది. కరెం టు స్తంభాలు నీట మునగడంతో పర్ణశాలతోపాటు పరిసర గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచింది. రామాలయ పరిసర ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. అధికారులు భారీ మోటర్లతో వరదనీటిని గోదావరిలోకి పం పింగ్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ పట్టణంలో హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారి బాగోగులను సెక్టోరియల్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోనే బసచేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నా రు. గురువారం కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్తో కలిసి భద్రాచలంలోని కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై మంత్రి అజయ్తో ఫోన్లో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం గోదావరి నీటిమట్టం భారీగా పెరగడంతో మునిగిపోయిన పుష్కరఘాట్లు
జల దిగ్బంధంలో ఏజెన్సీ..
వర్షాలకు ఐదో రోజూ ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, వెంకటాపురం, చింతూరు వెళ్లే ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలు స్తంభించాయి. బూర్గంపాడు మండలం సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, ఇరవెండి, అశ్వాపురం మండలంలోని లోతట్టు ప్రాంతవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ కాంతారావు పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు.
ఐదుసార్లు 60 అడుగులు దాటి..
భద్రాచలంలో గోదావరి ఇప్పటివరకు ఐదుసార్లు 60 అడుగులు దాటి ప్రవహించింది. 1976 నుంచి ఇప్పటివరకు 18 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తాజాగా ఈ నెల 14న (గురువారం) ఆరోసారి గోదావరి 60 అడుగులు దాటే అవకాశమున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క జూలై నెలలోనే రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి.
రామన్నగూడెంలో 3వ ప్రమాద హెచ్చరిక
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లను దాటుకుంటూ గోదారి ప్రవహించింది. రామన్నగూడెం, పేరూరు వద్ద గోదావరి ఉధృతికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. మంగపేటలో గోదావరి వరదకు బోర్నర్సాపురం వద్ద కరకట్టకు గండి పడింది. చండ్రుపల్లి, నగేపల్లి, మద్దులపల్లి, పలుగులు, కుంట్లం, పుస్కుపల్లి గ్రామాలు బ్యాక్ వాటర్తో పూర్తిగా నిండిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ సాయంతో దాదాపు 300 మంది పుస్కుపల్లి గ్రామస్తులను సురక్షితంగా కాళేశ్వరంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణ, తుంగభద్ర నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కర్ణాటకలో అన్ని ప్రాజెక్టులు నిండటంతో భారీ ఎత్తున వరద జూరాల, సుంకేశులకు చేరుతున్నది. సుంకేశుల పది గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 1.13 లక్షల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు.
పెద్దపల్లి, జూలై 14(నమస్తే తెలంగాణ)/మంథని : బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బాలుడిని ఒంటి చేత్తో పైకి లేపి వరదలో నుంచి వెళ్లే సీన్ గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని మర్రివాడలో ఆవిష్కృతమైంది. బొక్కలవాగు వరద తీ వ్రం కావడంతో మర్రివాడ ముంపునకు గురైంది. ఈ కాలనీ కి చెందిన పుప్పాల సుమలత-సుధాకర్తోపాటు 3 నెలల బాలుడు అక్కడే చిక్కుకుపోయారు. పుప్పాల రాము అనే యువకుడు బాలుడిని గంపలో పెట్టుకొని నెత్తిన ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ చిత్రాన్ని పలువురు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా సోషల్ మీడియా లో ‘బాహుబలి సీన్’ అంటూ చక్కర్లు కొడుతున్నది.