ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ (12727) రైలుకు పెనుముప్పు తప్పింది. రైలు విశాఖ నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరింది. బుధవారం ఉదయం 6.09 గంటలకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ వద్దకు చేరుకోగానే ఆరు బోగీలు అదుపు తప్పి రైలు నిలిచిపోయింది. ఎస్-1 నుంచి ఎస్ 4 వరకు, 2 జనరల్ బోగీలు పట్టాలు తప్పి 400 మీటర్ల వరకు దూసుకెళ్లాయి. 400 మీటర్ల పొడవునా పట్టాలు ధ్వంసమయ్యాయి.
రైలు పట్టాలు తప్పినా బోల్తా పడకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మిగతా 18 బోగీల ద్వారా హైదరాబాద్కు తరలించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్తోపాటు వివిధ శాఖల అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.