హైదరాబాద్ యూనిట్లో 300కు పెరుగనున్న ఉద్యోగుల సంఖ్య
దావోస్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ప్రకటన
హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరేందుకు ఆసక్తి
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా జీఎంఎం ఫాడ్లర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో థామస్ కెహ్ల్, దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ డైరెక్టర్ అశోక్ జే పటేల్ గురువారం తెలంగాణ పెవిలియన్లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు జీఎంఎం ఫాడ్లర్ ఆసక్తి వ్యక్తం చేసింది.
రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్తు తదితర రంగాల పరిశ్రమలకు అవసరమయ్యే పరికరాల తయారీలో ప్రత్యేకించి గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ల తయారీలో కంపెనీ ప్రపంచ ఖ్యాతి పొందింది. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం ఈ సంస్థ రెండేండ్ల క్రితం హైదరాబాద్లో దాదాపు రూ.49 కోట్ల (63 లక్షల డాలర్ల)తో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 2020-మార్చి 2022 మధ్య కాలంలో ఈ యూనిట్ వివిధ దేశాలకు 700 పరికరాలను ఎగుమతి చేసింది. ఇప్పుడు మరో 37 లక్షల డాలర్లతో హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించనుండటంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 300కు పెరుగుతుంది. ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము భారత్ వైపు చూస్తున్నామని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని థామస్ కెహ్ల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫార్మా పరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: కేటీఆర్
జీఎంఎం ఫాడ్లర్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలనుకునే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఫార్మా పరికరాల తయారీలో అగ్రస్థానానికి ఎదగాలన్న జీఎంఎం ఫాడ్లర్ లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ యూనిట్ కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.