హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది సింగరేణి జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఎం సురేశ్ను ‘ఉత్తమ సింగరేణియన్’ అవా ర్డు వరించింది. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఉత్తమ అధికారిగా, అన్ని ఏరియాల్లో కలిపి అత్యుత్తమ అధికారుల్లో ఒకరిని ‘ఉత్తమ సింగరేణియన్’గా ఎంపిక చేసి, సన్మానిస్తారు. ఈ ఏడాదికి సురేశ్ పేరును అవార్డుల ఎంపిక కమిటీ సిఫారసు చేసింది. 36 ఏండ్లుగా కంపెనీకి అందించిన విశిష్ట సేవలను, సమర్థ నాయకత్వ పటిమను గుర్తించి సురేశ్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
1987లో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా సింగరేణిలో చేరిన సురేశ్ 36 ఏండ్ల లో 34 ఏండ్లుగా బొగ్గు గనుల్లోని ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం విశేషం. ములుగు జిల్లా జంగాలపల్లిలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. జనరల్ మేనేజర్(కోఆర్డినేషన్) స్థాయికి చేరుకొన్నారు. అలాగే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, సింగరేణి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా రెండుసార్లు ‘నేషనల్ సేఫ్టీ అవార్డు’ అందుకొన్నారు. నిరుడు ఆగస్టు 15న సీఎండీ చేతుల మీదుగా ‘ఉత్తమ అధికారి’గా అవార్డు అందుకున్నారు.