వరంగల్, సెప్టెంబర్ 21: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలనతో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వరంగల్లో రూ.4.16 కోట్లతో నిర్మించిన దేవాదాయ, ధర్మశాఖ సమీకృత భవన్(ధార్మిక భవన్)ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయయ్భాస్కర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ధార్మిక భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అల్లోల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూపదీప, నైవేద్యాలకు గత పాలకులు రూ.2,500 ఇస్తే.. తెలంగాణ వచ్చాక రూ.10 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
ఈ పథకం ప్రస్తుతం 1,840 దేవస్థానాలకు వర్తిస్తున్నదని, భవిష్యత్తులో మరో 2,896 ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు. ధూపదీప, నైవేద్యాలతో చిన్న చిన్న గుడులు నేడు కళకళలాడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం లేదని విమర్శించారు. ఉత్తరాదిలో నిర్వహించే కుంభమేళాకు కోట్ల నిధులను కేటాయిస్తున్న కేంద్రం.. కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం జాతరకు మాత్రం ఒక్క రూపాయీ కేటాయిండం లేదని మండిపడ్డారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులు కేటాయించి మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తున్నదని కొనియాడారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. ధార్మిక భవన్ ప్రారంభించకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.