దుబాయ్ పర్యటనలోనూ మంత్రి కేటీఆర్ పెట్టుబడుల బోణి కొట్టారు. తొలిరోజే మూడు అంతర్జాతీయ సంస్థలు రూ.1,040కోట్ల పెట్టు బడులను ప్రకటించగా, లులూ గ్రూప్ రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల విస్తరణపై ఆసక్తి కనబర్చింది. ఫైర్సేఫ్టీ పరికరాల తయారీలో విఖ్యాత సంస్థ ‘నాఫ్కో’ తెలంగాణలో 700కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. డీపీ వరల్డ్ రూ.215కోట్లు, మలబార్గోల్డ్ 125 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకూ అమెరికాలో పర్యటించి.. తెలంగాణకు పెట్టుబడుల వరద పారించిన మంత్రి కేటీఆర్.. తాజాగా దుబాయ్లోనూ తొలిరోజే బోణీ కొట్టారు. గల్ఫ్ దేశంలో ఆయన పర్యటన మంగళవారం విజయవంతంగా ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు కంపెనీలతో భేటీ అయి తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వివరించగా, మూడు దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో (ఎన్ఏఎఫ్ఎఫ్సీఓ) రూ. 700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు సుముఖత వ్యక్తంచేసింది. నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం లో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారుచేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. త్వరలోనే ప్లాంట్ను ప్రారంభిస్తామని తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్కు సరిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంటుతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంతర్జాతీయస్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు ‘నాఫ్కో’ కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో మంత్రి కేటీఆర్కు వివరించారు.
లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ డీపీ వరల్డ్ తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.215 కోట్లను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్టు ప్రముఖ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్తో మంగళవారం డీపీ వరల్డ్ గ్రూపు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ మెహతా, ప్రాజెక్టు డెవలప్మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి దుబాయ్లో సమావేశమయ్యారు. తెలంగాణ సర్కారు తొమ్మిదేండ్లలో చేపట్టిన అనేక వ్యాపార అనుకూల పాలసీలను కేటీఆర్ వివరించారు. రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణలో తన కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను డీపీ వరల్డ్ ప్రకటించింది. పోర్టుల నిర్వహణలో ప్రపంచ లీడర్గా ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్లో తన ఇన్లాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్ కోసం రూ.165 కోట్లను పెట్టుబడిగా పెట్టి, తన కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలియజేసింది. వ్యవసాయ రంగ ప్రగతికి చేదోడు వాదోడుగా నిలిచే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. రూ.50 కోట్లతో మేడ్చల్ ప్రాంతంలో 5 వేల ప్యాలెట్ సామర్థ్యంగల ప్రపంచ ప్రమాణాలతోకూడిన కోల్డ్ స్టోరేజ్ వేర్హౌస్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రకటించిన మలబార్ గ్రూప్.. ఇతర రంగాల్లోనూ తన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో పెట్టుబడి పెట్టిన సంస్థ తాజాగా రాష్ట్రంలో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ను ఏర్పా టు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.125 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు తెలియజేసింది. తద్వారా రాష్ట్రంలోని 1000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. మలబార్ గ్రూపు ప్రతినిధి బృందం మంగళవారం మంత్రి కేటీఆర్తో దుబాయ్లో సమావేశమైంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తమ గోల్డ్ రిఫైనరీ, ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్మాణ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. కాగా, తెలంగాణలో తమ పెట్టుబడులను, కార్యకలాపాలను విస్తరిస్తున్న మలబార్ గ్రూపునకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజం డీపీ వరల్డ్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం, తన కార్యకలాపాలను విస్తరించడం వల్ల తెలంగాణ లాజిస్టిక్స్ రంగం బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డీపీ వరల్డ్ కార్యకలాపాల విస్తరణ కోసం కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.
యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీ లులూ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో దుబాయ్లో సమావేశమైంది. షాపింగ్ మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రీటెయిల్ తదితర రంగాల్లో తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి ఈ సందర్భంగా వారు మంత్రికి వివరించారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై సంతృప్తి వ్యక్తంచేస్తూ మంత్రి కేటీఆర్, తెలంగాణ సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లలో ప్రతిపాదిత ఆక్వా క్లస్టర్లో పెట్టుబడి పెట్టనున్నామని, ఆ ప్రాంతం నుంచి ఏటా రూ.వెయ్యి కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరించనున్నట్టు ప్రకటించారు. కోల్డ్ స్టోరేజీ, చేపల ప్రాసెసింగ్ యూనిట్లో తాము పెట్టుబడి పెడతామని చెప్పారు. దీనిద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు వివరించారు.