పటాన్చెరు, ఆగస్టు 26: హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించినట్టు జీసీజీసీ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డైనమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ (డీడబ్ల్యూసీ), గీతంలోని అదర్ కెరీర్ ఆప్షన్స్ (ఓసీవో)ల సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గీతం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతోపాటు దరఖాస్తు ప్రక్రియ, ఉపకార వేతనాలు, కోర్సులు, వసతి సౌకర్యం, ఇతర విలువ-ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకొన్నట్టు ఆయన వివరించారు. విదేశీ వర్సిటీల ప్రతినిధులు, గీతం ఉన్నతాధికారులతో పాటు విద్యార్థులు ముఖాముఖి సంభాషించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఓసీవో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవికాంత్, నరేశ్ గుండోజు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సదరన్ కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ (చికాగో-స్ప్రింగ్ఫీల్డ్) డేటన్, మసాచుసెట్స్, డూండీ, స్ట్రాత్ైక్లెడ్, యార్క్ నాటింగ్హమ్ వర్సిటీలతోపాటు న్యూస్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని డాక్టర్ వేణుకుమార్ తెలిపారు.