హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. బయలాజికల్స్, బయోసిమిలర్, యాంటిబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తదితర ఔషధాలను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. గ్లాండ్ ఫార్మా గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 300 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్లు, బయలాజికల్స్, బయోసిమిలర్, యాంటిబాడీస్ తదితర ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 200 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం విస్తరిస్తున్న తయారీ కేంద్రాన్ని జీవసంబంధ ఉత్పత్తుల తయారీలో అనుసరించాల్సిన జాతీయ, అంతర్జాతీయ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శ్రీనివాస్ సదు సోమవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో సమావేశమైన అనంతరం ఈ మేరకు కంపెనీ విస్తరణ ప్రణాళికను వెల్లడించారు. గ్లాండ్ ఫార్మా గత 40 సంవత్సరాలుగా జెనరిక్ ఇంజెక్టబుల్ ఔషధాలతోపాటు ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలకోసం నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నది. ప్రస్తుతం భారత్లో ఎనిమిది తయారీ కేంద్రాల ద్వారా వెయ్యి మిలియన్ యూనిట్ల ఫార్ములేషన్ సామర్థ్యం కలిగివున్నది. ఇందులో 28 ప్రొడక్షన్ లైన్లుగల నాలుగు ఫినిష్డ్ ఫార్ములేషన్ల సౌకర్యాలు, అలాగే జీనోమ్ వ్యాలీలోని సౌకర్యం సహా మరో నాలుగు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్(ఏపీఐ) సౌకర్యాలు ఉన్నాయి.
రాష్ట్ర సంకల్పంలో మేము సైతం: శ్రీనివాస్ సదు
హైదరాబాద్లోని తమ తయారీ కేంద్రాన్ని విస్తరించడం ద్వారా తెలంగాణను ప్రపంచ ఔషధాల కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేయడంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నదని గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈవో శ్రీనివాస్ సదు పేర్కొన్నారు. తమ పరిశ్రమ విస్తరణ ద్వారా కొత్తగా 500 మందికిపైగా స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.
తెలంగాణ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది: కేటీఆర్
బయలాజికల్స్, బయోసిమిలర్, యాంటిబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తదితర రంగాల్లో తమ సామర్థ్యాన్ని పెంపొందించుకొనేందుకు తెలంగాణ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, గ్లాండ్ ఫార్మా కూడా ఈ రంగాలపైనే రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో తమ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. ఇందులో 500 మందికిపైగా తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు లభించడం మంచి పరిణామమని తెలిపారు. గ్లాండ్ ఫార్మా తాజా విస్తరణ హైదరాబాద్కు, జీనోమ్ వ్యాలీకి జీవశాస్ర్తాలు, ఔషధ రంగాల్లో ఉన్న సానుకూల వ్యవస్థకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర సంకల్పంలో మేము సైతం
హైదరాబాద్లోని మా తయారీ కేంద్రాన్ని విస్తరించడం ద్వారా తెలంగాణను ప్రపంచ ఔషధ కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేయడంలో భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నది. గ్లాండ్ ఫార్మా విస్తరణ ద్వారా కొత్తగా 500
మందికిపైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
– శ్రీనివాస్ సదు ఎండీ, గ్లాండ్ ఫార్మా