హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మార్చి 1న నిర్వహించ తలపెట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, బందోబస్తు కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీ రవిగుప్తాను కోరింది. బుధవారం ఈ మేరకు డీజీపీని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, పార్టీ నేతలు నాయినేని రాజేశ్వర్రావు, రాఘవ తదితరుల బృందం కలిసి వినతిపత్రం, హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు చేసే రూట్ మ్యాప్ను అందజేసింది.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ బృందం ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, పరకాల, భూపాలపల్లి (మధ్యాహ్న భోజనం) మేడిగడ్డకు చేరుకొంటున్నదని పార్టీ నేతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, సాగునీటి రంగ నిపుణులు ఈ బృందంలో పాల్గొననున్నారు. కాగా, బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అవసరమైన చర్యలు తీసుకొంటామని డీజీపీ తమకు హామీ ఇచ్చినట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు.