జయశంకర్ భూపాలపల్లి : దేవుడు ప్రసాదించిన నార్మల్ డెలివరీలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఫలానా రోజే తనకు డెలివరీ కావాలని మీ అంతట మీరే సిజేరియన్లు చేయించుకుంటే ఆ దేవుడు కూడా ఏం వరమివ్వడు అని హరీశ్రావు అన్నారు. డెలివరీల కోసం ముహుర్తాలు పెట్టుకోవడం సరికాదన్నారు. గర్భిణిల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రూ. 55 కోట్ల వ్యయంతో 200 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని తెలిపారు. రూ. 6 కోట్లతో రేడియోలజీ, పాథాలజీ ల్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ల్యాబ్ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేయిస్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు. కానీ సిజేరియన్లు తగ్గించాలన్నారు. జడ్పీ ఛైర్మన్ సర్కార్ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యారు. కొత్తగూడెం కలెక్టర్ భార్య మాధవి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యారు. ఎస్పీ సునీల్ దత్ భార్య కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యారని మంత్రి గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగిందని హరీశ్రావు తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మాత్రమే డెలివరీలు జరిగేవి. తెలంగాణ వచ్చాక ఆ సంఖ్య 56 శాతానికి పెరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం డెలివరీలు జరగాలన్నారు. అది కూడా నార్మల్ డెలివరీలే చేయాలని మంత్రి సూచించారు.
సాధారణ ప్రసవాలు అయ్యేందుకు గర్భిణిలు ప్రతి రోజు తగిన వ్యాయామం చేయాలని హరీశ్రావు సూచించారు. ఎక్సైజ్ చేయకపోవడంతో శక్తి కూడా లేకుండా పోతుందన్నారు. ఆశా, ఎఎన్ఎంల ఐ ప్యాడ్లు, ఫోన్లకు వ్యాయామానికి సంబంధించిన వీడియోలు పంపుతామన్నారు. ఈ వీడియోల్లో పొందుపరిచిన వ్యాయామాలకు అనుగుణంగా గర్భిణిలు చేయాలని హరీశ్రావు సూచించారు.