హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కారణాల అన్వేషణలో అన్నివిధాలుగా సహకరించాలని కోరింది. మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోని సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు ఆరుగురు సభ్యులతో ఎన్డీఎస్ఏ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ర్టానికి విచ్చేసింది. ఆ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులు యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్కుమార్ సింగ్, మెంబర్ సెక్రటరీ అమితాబ్ మీనా జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావుతోపాటు ఆయా ప్రాజెక్టుల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 3 బరాజ్లకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బరాజ్ల జియోఫిజికల్ క్రాస్ సెక్షనల్ రిపోర్టుతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులను సమర్పించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర అధికారులకు సూచించింది.
జియోఫిజికల్ రిపోర్ట్ను ఇప్పటికే అందజేశామని రాష్ట్ర అధికారులు తెలుపగా.. మరింత సమగ్రంగా అందజేయాలని కమిటీ ఆదేశించారు. థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ అనేది గతంలో ఈపీసీ విధానంలో ఉండేదని, దానిపై అనేక ఆరోపణలు రావడంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలగించామని రాష్ట్ర అధికారులు వివరించారు. ఎన్డీఎస్ఏ కోరిన ప్రతి రిపోర్టును సమగ్ర వివరాలతో అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు నేతృత్వంలో బరాజ్ల పరిశీలనకు బయలుదేరి వెళ్లింది. గురువారం ఉదయం మేడిగడ్డ, అన్నారం బరాజ్లను.. శుక్రవారం సుందిళ్ల బరాజ్ను సందర్శించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నది. అనంతరం 9న హైదరాబాద్కు తిరిగివచ్చి జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ ఉన్నతాధికారులతోపాటు ఆయా బరాజ్ల డిజైన్లు, ప్రణాళికల రూపకల్పనలో, నిర్మాణంలో భాగస్వాములైన అన్నివిభాగాల కీలక అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నది.