హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పాలిసెట్-2021 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. 92,557 మంది పరీక్ష రాయగా, 75,666 (81.75 శాతం) మంది పాలిసెట్లో అర్హత సాధించారు. ఇందులో బాలురతో పోల్చితే బాలికలే ఎక్కువమంది అర్హత సాధించారు. బాలురు 79.81 శాతం మంది అర్హత సాధించగా, 84.39 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ర్యాంక్లతో పాటు, విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో పొందుపర్చారు. ఫలితాల విషయంలో సమస్యలుంటే 040-23222192 నెంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. కాగా, పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 నుంచి 9 వరకు స్లాట్బుకింగ్ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 14న సీట్లను కేటాయించనున్నారు. 23 నుంచి రెండో విడత స్లాట్బుకింగ్ చేపట్టి, 27న సీట్లు కేటాయించనున్నారు.
డిప్లొమాలో కొత్త కోర్సులు
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్లో ఈ ఏడాది కొత్తగా నాలుగు కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వర్తమాన పోటీ ప్రపంచానికి తగినట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్, క్లౌడ్కంప్యూటింగ్ అండ్ బిగ్డేటా, లాజిస్టిక్స్ టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సీ శ్రీనాథ్ పేర్కొన్నారు.