Telangana | మహిళలకు అన్ని రంగాల్లోనూ సముచిత స్థానం లభించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నది నిజం. అది ఒక్క రాజకీయ రంగానికే పరిమితం కాకూడదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉన్నది. పుట్టిన శిశువు నుంచి వారి చదువు, సంక్షేమం విషయంలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నది.
కేంద్రం హడావుడిగా మహిళా బిల్లును ప్రవేశపెట్టింది కానీ, సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే మహిళా సాధికారతపై దృష్టిసారించారు. అన్ని రంగాల్లోనూ వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన వారిలో ఎక్కువమంది నిరుపేద అమ్మాయిలే కావడం అందుకు తార్కాణం. ఒకప్పుడు నీట్లో మంచి ర్యాంకు వచ్చినా సీటు వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. వచ్చినా లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. లేదంటే రష్యా, ఉక్రెయిన్, చైనావంటి దేశాలకు వెళ్లాల్సివచ్చేది. తెలంగాణ బిడ్డలకు ఇప్పుడా బాధ తప్పింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉన్న ఊరిలోనే వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభించింది. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించిన నిరుపేద అమ్మాయిలపై ప్రత్యేక కథనం
మహిళలు ఆకాశంలో సగమని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. ఏ రంగం చూసుకున్నా వారి ప్రాతినిధ్యం అంతంతే. ముఖ్యంగా విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో కనిపించేది కొద్దిమందే. తెలంగాణలో ఇకపై ఈ ముఖచిత్రం మారబోతున్నది. జిల్లాకొకటి చొప్పున ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించిన వారిలో అత్యధికులు అమ్మాయిలే. అందులోనూ.. ఉండడానికి సరైన ఇల్లు లేని, సరిగా తిండికి నోచుకోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. డాక్టర్లమై తమలాంటి నిరుపేదలకు సేవలు అందించాలన్న కలను సాకారం చేసుకున్న వీరంతా తమ అదృష్టానికి పొంగిపోతున్నారు. సొంత జిల్లాలో ఉచితంగా ఎంబీబీఎస్ చదువుకునే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఎక్కువమంది అమ్మాయిలకు మెడికల్ సీట్లు లభించడంతో తెలంగాణ వైద్య రంగంలో ఇకపై మహిళల వాటా పెరగబోతున్నది.
కింది ఫొటోలో తల్లితో కలిసి కనిపిస్తున్న అమ్మాయి పేరు స్రవంతి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలోని చంద్రవెల్లి ఆమె స్వస్థలం. తండ్రి శంకర్ క్యాన్సర్తో మరణించాడు. నిరుపేద కొలవార్ తెగకు చెందిన స్రవంతి ఐదో తరగతి వరకు సర్కారు బడిలోనే చదువుకుంది. కస్తూర్బా గురుకుల విద్యాలయంలో పదో తరగతి పూర్తిచేసింది. ఇంటర్ తర్వాత హైదరాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని ఆపరేషన్ ఎమరాల్డ్లో కోచింగ్ తీసుకుని నీట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంది. కరీంనగర్లోని ప్రతిమా కళాశాలలో మెడికల్ సీటు సాధించి నామమాత్రపు ఫీజుతో ఎంబీబీఎస్ చదువుతున్నది. ఒక్క స్రవంతే కాదు.. ఇలాంటి ఎందరో నిరుపేదలు సర్కారు స్కూళ్లలో చదివి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
పేదలకు వైద్యం అందిస్తా
మాది చాలా పేద కుటుంబం. నేను పదో తరగతిలో ఉండగా నాన్న శంకర్ క్యాన్సర్తో చనిపోతే అమ్మ బుచ్చమ్మ చీపుర్లు అమ్మి నన్ను చదివించింది. సర్కారు బడుల్లోనే చదువుకున్నా. నీట్లో తొలి ప్రయత్నంలోనే 2,782 ర్యాంకు వచ్చింది. సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టడంతో కరీంనగర్లోని ప్రతిమా కాలేజీలో నాకు సీటు వచ్చింది. థ్యాంక్స్ టు కేసీఆర్ సర్. డాక్టర్నై తండ్రి పేరు నిలబెడతా. డాక్టర్ చదువు పూర్తికాగానే గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందిస్తా. నీట్లో ర్యాంకు సాధించినప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ సన్మానించడాన్ని మర్చిపోలేను.
– స్రవంతి, చంద్రవెల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్
జిల్లాకో మెడికల్ కాలేజీ వల్లే..
గతంలో ఎంబీబీఎస్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. మంచి ర్యాంకు కోసం లాంగ్టర్మ్ కోచింగులు తీసుకోవాల్సి వచ్చేది. అంతంత ఖర్చు పెట్టడం మాలాంటి వాళ్లకు అయ్యే పనికాదు. ఇప్పుడు ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల నాలాంటి వాళ్లకు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం లభించింది. నీట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంకు సాధించా. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటొచ్చినందుకు సంతోషంగా ఉంది.
– తీగారపు శ్రీలేఖ, మొండ్రాయి, వరంగల్
ఫెసిలిటీలు మంచిగున్నయ్
ఈ సారి నేషనల్ లెవల్లో నీట్ రాసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉన్నది. కానీ తెలంగాణలో అన్ని రాష్ర్టాల కంటే ఎక్కువ సీట్లున్నాయి. ఇక్కడి స్టూడెంట్స్కే ఎక్కువ ఆడ్మిషన్లు ఇస్తున్నారు. అందుకే ఈజీగా ఆడ్మిషన్ వచ్చింది. ఇందుకు కారణమైన కేసీఆర్ సార్కు థ్యాంక్స్ చెప్పాలి. నా లాంటి మిడిల్క్లాస్ స్టూడెంట్స్కు డాక్టరయ్యే అవకాశం వచ్చేదికాదు. కేసీఆర్ సార్ వల్లే కరీంనగర్లో ఇంటి నుంచి వెళ్లి మెడిసిన్ చదువుకునే అవకాశం వచ్చింది. కరీంనగర్ కాలేజీలో ఫెసిలిటీస్ మంచిగున్నయ్. మా ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలనే మా నాన్న కల నెరవేరుతుంది.
– తునికి వర్షిణి, కరీంనగర్ (కరీంనగర్ మెడికల్ కాలేజీ)
తొలి ప్రయత్నంలోనే సీటు
మాది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేది. కోచింగ్ తీసుకోకుండానే కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించి సీటు సంపాదించా. సొంత జిల్లాలోనే చదవాలని అనుకున్నా. కౌన్సెలింగ్లో మూడు కాలేజీల్లో అవకాశం వచ్చినా మహబూబాబాద్నే ఎంచుకున్నా. నాకు అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. డాక్టర్నై పేదలకు సేవలందిస్తా. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు వల్లే సొంత జిల్లాలో చదువుకునే అవకాశం లభించింది.
– స్వాతి, గార్ల, మహబూబాబాద్
ఆరో తరగతి నుంచి కల..
పేద విద్యార్థులకు విద్యను చేరువ చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు థ్యాంక్స్. పేద విద్యార్థులు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించలేరు. అలాంటి వారు ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. డాక్టర్ కావాలని ఆరో తరగతి నుంచి కలగంటున్నా. అది నేడు ప్రభుత్వ కృషితో సాకారమైతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వికారాబాద్ కళాశాలలో సీటు వచ్చినందుకు ఆనందంగా ఉంది. క్యాంపస్ కూడా చాలా నీట్గా ఉంది. సౌకర్యాలు కూడా బాగున్నాయి.
– విష్ణుశ్రీ, వైద్య విద్యార్థిని, నల్లగొండ
జిల్లాకు కాలేజీ రావడం వల్లే సీటొచ్చింది
ఒకప్పుడు మెడికల్ సీటు కావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ మెడికల్ కళాశాలలో సీటు రాకుంటే ఇక ప్రైవేటు కళాశాలకు వెళ్లాల్సిందే. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఇకడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి, తరగతులు ప్రారంభించారు. సొంత జిల్లాలోని సీటు రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలకు వైద్యం అందిస్తా.
– నిహారిక, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని
ఇక్కడే ఎంబీబీఎస్ చదువుతాననుకోలేదు
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలని అనుకునేదానిని. నాన్న ప్రభాకర్ ఫొటోగ్రాఫర్. అమ్మ విజయలక్ష్మి టైలర్. వారు నన్ను ఎంతోకష్టపడి చదివించారు. నేనూ అలాగే చదివాను. నా చదువుతోపాటు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కూడా పెరుగుతూ వచ్చాయి. అది నాకు వరమైంది. గోదావరిఖనిలో నిరుడు మెడికల్ కళాశాల ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఎంబీబీఎస్ చదవాలని అనుకున్నా. అనుకున్నట్టే సీటు దక్కించుకున్నా. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పుట్టి పెరిగిన ఊరిలోనే ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం దక్కింది. ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి లేదు.
– కామని జయశ్రీ ఎంబీబీఎస్ విద్యార్థిని గోదావరిఖని
గురుకులంలో చదివి ఎంబీబీఎస్
నా తండ్రి మంజినాయక్ ఇంటర్దాకా చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే మానేసినట్టు చెప్పి బాధపడేటోడు. బాగా చదువుకొని ఎదగాలని ప్రోత్సహించాడు. నాకు చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని ఆశ. ఆరో తరగతిలోనే ఇంటి గోడలపై ‘శైలు ఎంబీబీఎస్’ అని రాసుకున్నా. అదే లక్ష్యంగా చదివాను. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేసి సర్జన్ కావాలనుకుంటున్నా. కోర్సు పూర్తయ్యాక మారుమూల గ్రామాల ప్రజలకు సేవలు అందించాలనేది నా కోరిక. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులంలో చదివి సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టడం వల్లే నాకు సీటొచ్చింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ధరావత్ శైలు, విద్యార్థిని
సొంతూరులోనే సీటు వస్తుందనుకోలేదు
ఎంబీబీఎస్ చదివేందుకు ఎక్కడి వెళ్లాలో అని భయపడ్డాను. కానీ సొంతూరులోనే మెడికల్ సీటు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. తెలంగాణలో ఇన్ని మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉండకపోతే నాకు నీట్లో వచ్చిన ర్యాంక్తో వైద్య విద్య సాధ్యపడేది కాదు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నాలాంటి వారికి ఎంబీబీఎస్ చదివే అదృష్టం లభించింది. పుట్టిపెరిగిన ఊరులోనే మెడిసిన్ చదువుతున్నానంటే నమ్మబుద్ధి కావడం లేదు. మాలాంటి వారి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు థ్యాంక్స్.
-మట్టపల్లి కావేరి, సూర్యాపేట
పట్టుదలతో చదివి..
నాకు ఆసిఫాబాద్లోని వైద్య కళాశాలలో సీటు వచ్చింది. కొత్త కళాశాలల ఏర్పాటుతోనే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను డాక్టర్ కావాలని మా అమ్మానాన్నల కోరిక. వారు నన్ను కష్టపడి చదివిస్తున్నారు. పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ పూర్తి చేస్తా. మా అమ్మానాన్నల కల నెరవేరుస్తా.
– శ్రీజ, జయశంకర్ భూపాలపల్లి
నాన్న ప్రోత్సాహం.. నా పట్టుదల..
మా నాన్న ఎక్కువగా చదువుకోకపోవడంతో చిన్న ఉద్యోగం చేసేవారు. మమ్మల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. ఆయన మాటలతో పట్టుదలగా చదువుకున్నా. ఇంటర్ పూర్తయ్యాక కోచింగుకు వెళ్లే ముందు మా అమ్మానాన్న కూర్చోబెట్టి చెప్పారు. మెడిసిన్ చదవడం అంటే మాటలు కాదు. మన ఆర్థిక పరిస్థితి అందుకు సరిపోదు అని. ఫ్రీ సీటు సాధిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. లేదంటే ఫార్మసీ చదవాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఈ విషయం మర్చిపోకుండా పట్టుదలతో కోచింగ్ తీసుకుని నీట్కు అటెండ్ అయ్యా. మంచి మార్కులు సాధించి ఫ్రీ సీటు సాధించా. ఉన్న ఊరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఎంబీబీఎస్ పూర్తి కాగానే పీజీ కూడా చేస్తా. నాలాంటి పేద విద్యార్థులు, మెడిసిన్ చదవలేరని అనుకునే చాలా మందికి నేను స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా. భవిష్యత్తులో నాలాంటి పేద విద్యార్థులు మెడిసిన్ లాంటి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారి కోసం ఫ్రీగా కోచింగ్ ఇప్పించాలని ఉంది.
-విమ్మరి దీక్షిత, వైద్య విద్యార్థిని, కరీంనగర్
కార్డియాలజిస్ట్ అవుతా
మాది నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచి బాగా చదువుతుండడంతో డాక్టర్ను చేయాలని తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఇంటర్ పూర్తికాగానే నీట్ రాస్తే అనుకున్న ర్యాంక్ రాలేదు. రెండోసారి కోచింగ్ తీసుకుని రాస్తే రాష్ట్రస్థాయిలో 3 వేల ర్యాంకు వచ్చింది. జగిత్యాల ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు వచ్చింది. గతంలో 500 లోపు ర్యాంకు వస్తేనే సీటు వచ్చేది. ఇప్పుడు కాలేజీలు, సీట్లు పెంచడం, స్థానికులకు 85శాతం సీట్లు కేటాయించడంతో నాలాంటి పేదలకు కూడా ఎంబీబీఎస్ చదివే అవకాశం లభిస్తున్నది. కార్డియాలజిస్టునై గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సేవలందిస్తా.
– చలిగంటి వర్షిక, ఖానాపురం, వరంగల్
ఏజెన్సీ ప్రజలకు సేవ చేస్తా
అమ్మానాన్నల ప్రోత్సాహంతో కష్టపడి చదివి నీట్లో ర్యాంకు సాధించా. ఆసిఫాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించా. డాక్టర్ చదువు పూర్తయ్యాక ఏజెన్సీ ప్రజలకు సేవ చేస్తా. నిరుపేదలు కూడా వైద్యులు కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం వల్లే నాలాంటి ఎందరో ఎంబీబీఎస్ చదవగలుగుతున్నారు. డాక్టర్ చదువు కోసం వేరే రాష్ర్టాలకో, దేశానికో వెళ్లే బాధ తప్పింది. కొద్దిపాటి డబ్బులతోనే వైద్యవిద్య పూర్తి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది.
– దుబాకుల ప్రణవి, ఆంజనేయపాలెం, భద్రాద్రి కొత్తగూడెం
పైసా ఖర్చు లేకుండా మెడిసిన్ సీటు
మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న గీత కార్మికుడు. అమ్మ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తది. ఇద్దరూ కష్టపడి చదివించారు. నన్ను డాక్టర్గా చూడాలని వారిద్దరూ కలలుగన్నారు. వారి ఆశలకు అనుగుణంగానే చదివాను. నీట్లో రాష్ట్రస్థాయిలో 4 వేల ర్యాంకు వచ్చింది. కౌన్సెలింగ్లో నిర్మల్ మెడికల్ కళాశాలలోనే సీటు వచ్చింది. పైసా ఖర్చు లేకుండా ఎంబీబీఎస్ చదవబోతున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్లో ఢిల్లీలోని ఎయిమ్స్లో రేడియాలజీలో పీజీ చేయాలని ఉంది.
– కేసరి స్నేహిత, గోలేటి, కుమ్రంభీం ఆసిఫాబాద్
ఫ్రీ సీటు వస్తుందో.. రాదో అనుకున్నా
మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం చేస్తూనే అమ్మానాన్న ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. డాక్టర్ కావాలన్న నా కల నెరవేర్చేందుకు వారు ఎంతో కష్టపడ్డారు. కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించా. అయితే, ఉచిత సీటు వస్తుందో, రాదోనని భయపడ్డా. కానీ, ప్రభుత్వం జనగామలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. నా ఆనందానికి అంతేలేకుండా పోయింది. గతంలో ఎంబీబీఎస్ చదివేందుకు ఎక్కడికో వెళ్లేవారు. ఇప్పుడు సొంత జిల్లాలోనే వైద్య విద్య అభ్యసించే అవకాశం దక్కింది. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల నాలాంటి ఎంతోమందికి డాక్టర్ అయ్యే అవకాశం లభించింది.
– తొగరు కృషిత, తొగరురామయ్యపల్లి, వరంగల్