ములుగు : నాలుగేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రేమికురాలు బైఠాయించింది. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామానికి చెందిన యువతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. అదే శాఖలో బీట్ అధికారిగా పని చేస్తున్న శ్రీధర్ యువతితో నాలుగేళ్లు ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
పెళ్లి మాట వచ్చేవరకు మొహం చాటేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా కూడా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సోమవారం ములుగులోని శ్రీధర్ ఇంటి ముందు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. ప్రేమించిన శ్రీధర్ తనను పెళ్లి చేసుకోకుంటే బలవన్మరణానికి పాల్పడుతానని యువతి పేర్కొంది. కాగా, ప్రేమికులు ఇద్దరు అటవీ శాఖలో పనిచేస్తుండడంతో ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.