ఊట్కూరు (మహబూబ్నగర్) : పాము కాటుకు చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ సలాం, ఆశాబీ దంపతుల కూతురు అబ్షా (4) శుక్రవారం రాత్రి భోజనం అనంతరం తల్లి పక్కనే నిద్రించింది. గ్రామ శివారులో ఉన్న ఇంట్లో తల్లీకూతుళ్లు నిద్రిస్తుండగా అర్ధరాత్రి చిన్నారిని పాముకాటు వేసింది. వెంటనే కుటుంబీకులు గుర్తించి చిన్నారిని నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించగా.. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.