హైదరాబాద్: ఆమె ఏడో తరగతి చదువుతున్నది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి ఫోన్ కొనిచ్చాడు. అయితే వరుసకు మామ అయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తున్నది. గుర్తించిన బాబాయ్ ఆమెను మందలించాడు. మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్లో జరిగింది.
మియాపూర్లోని హనీఫ్ కాలనీకి చెందిన నందిని.. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉండటంతో నందినికి ఆమె తండ్రి సెల్ఫోన్ కొనిచ్చాడు. అయితే ఆమె వరసకు మామ అయ్యే వ్యక్తితో తరుచూ చాటింగ్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు.
అయినప్పటికీ వినకపోవడంతో బాబాయ్ ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లి, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పీ.. ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.