Ginger Garlic Price | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఘాటెక్కాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. దీంతో వాటి రుచికి అలవాటుపడ్డ వారు జిహ్వచాపల్యం చంపేసుకుంటున్నారు. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర రూ.500 టచ్ చేసింది. అల్లం కూడా కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. దీంతో వంటి గది నుంచి అల్లం, వెల్లుల్లి మాయమవుతున్నాయి. రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపయ్యాయి.
గత నవంబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి, అల్లం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్లో హోల్సేల్ మారెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి ధర రూ.250 ఉండగా రిటైల్ మారెట్లో రూ.350 నుంచి రూ.400 వరకు పలికింది. ప్రస్తుతం కిలో రూ.450 నుంచి రూ.500కి ఎగబాకింది. అల్లం ధరలు కూడా కిలో రూ.300 నుంచి రూ.350 వరకు పలుకుతున్నాయి.
ఉస్మాన్గంజ్ లాంటి హోల్సేల్ మారెట్లలో ధర తకువగా ఉంటుందని వచ్చిన వినియోగదారులు వాటి ధరలు చూసి కంగుతింటున్నారు. వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోవడంతో ధరల స్వైరవిహారానికి కారణం. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బతిన్నదని వ్యాపారులు తెలిపారు. డిమాండ్కు తగిన సైప్లె లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతున్నది.
భారత్లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 40% వాటా మహారాష్ట్రదే. ప్రస్తుతం పాత స్టాక్ అరకొరగా అందుబాటులో ఉండగా.. కొత్త పంట కోసం మరో రెండు నెలలపాటు నిరీక్షణ తప్పదు. అప్పటివరకూ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నదని హోల్సేల్ వ్యాపారాలు చెప్తున్నారు. పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో వ్యాపారులు బ్లాక్మార్కెట్కు తరలించి, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.