Gift A Smile | అమెరికాలో నివసిస్తున్నా.. తన ఆలోచనలన్నీ జన్మభూమి తెలంగాణ చుట్టే తిరుగుతున్నాయి. విద్యావైద్యం అనే రెండు అత్యున్నత సేవా మార్గాలను ఎంచుకుని పలువురికి అండగా నిలుస్తున్నాడా యువకుడు. కడు పేదరికం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. తన మాదిరిగా ఇతరులకు అడ్డంకులు ఎదురుకావద్దనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు చేయూతగా నిలుస్తున్నారు. తద్వారా పలువురిలో స్ఫూర్తి నింపుతున్నారు ఎన్ఆర్ఐ పొట్టి శ్రీనివాస్.. ఆయన స్ఫూర్తిదాయక జీవనంపై ప్రత్యేక కథనం..!
ఇక్కడ ఉన్న స్కూల్ కొత్తగా కళకళలాడుతోంది కదూ. మొన్నటి వరకు పెచ్చులూడుతూ, రంగులు వెలిసి కళా విహీనంగా తయారైన ఈ స్కూల్కు మళ్లీ జీవం పోయడంలో ముందుండి నడిచిన వ్యక్తి పొట్టి శ్రీనివాస్. సుమారు రూ.20 లక్షలతో పునర్నిర్మించారు ఆయన. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఆ రోజు శ్రీనివాస్ ఆనందానికి అవధులు లేవు.
శ్రీనివాస్ పుట్టిన ఊరు ఇది. కన్నతల్లి అంటే ఎంత మమకారమో.. తనకు జన్మనిచ్చిన ఈ నేలన్నా అంతే మమకారం. ప్రస్తుతం శ్రీనివాస్ అమెరికాలోని ఓ బహుళజాతి కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నా.. తన మనసంతా ఇక్కడే ఉంటుంది.
శ్రీనివాస్ ఊహ తెలియని వయసులోనే తండ్రి సత్తయ్య పటేల్ చనిపోవడంతో తల్లి అమృతమ్మ ఐదుగురు ఆడబిడ్డలతో సహా జిల్లెడ్ గ్రామం నుంచి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా (గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) షాద్ నగర్కు వలస వెళ్లిపోయారు. అక్కడే ఓ పాల డెయిరీలో పని చేస్తూ పిల్లలను పెంచారు. శ్రీనివాస్ తన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత తన అక్కల దగ్గర ఉంటూ చదువుకున్నారు. హైదరాబాద్లో ఇంజినీరింగ్, ఎంఎస్ చేసి.. అమెరికాలో జాబ్ కొట్టారు. 2014లో యూఎస్ వెళ్లిన శ్రీనివాస్ తన కార్యక్షేత్రాన్ని మాత్రం జిల్లెడ్ ను చేసుకున్నారు.
ఎవరు ఏ ఆపదతో తనను సంప్రదించినా వెంటనే తనకు చేతనైనంత ఆర్థిక సాయం అందిస్తున్నారు శ్రీనివాస్. అలా సాయం అందుకున్న వారిలో ఎంతో మంది ఉన్నారు. తన సేవా కార్యక్రమాలకు అమ్మ ఇచ్చిన స్ఫూర్తే కారణం అంటారు ఆయన. తాను చదువుకునే సమయంలోనే మరో పక్క జాబ్ చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకునే వాడినని తెలిపారు. వాటిల్లో ఫీజులు కట్టలేని వారికి, అనారోగ్య సమస్యలతో ఉండే వారికి ఎంతో కొంత ఇచ్చేవాడినని చెప్పారు.