పోచమ్మమైదాన్, మే 25 : లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలు, నిరాశ్రయులు, పారిశుధ్య కార్మికులు, అనాథల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకువస్తున్నారు. భోజనం తయారు చేసి వారికి అందజేస్తున్నారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో మంగళవారం ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ ఆడెపు రవీందర్ పుట్టిన రోజు సందర్భంగా పోచమ్మమైదాన్తో పాటు వరంగల్ చౌరస్తా, పోస్టాఫీస్, బస్టాండ్ సమీపంలో పోలీసు సిబ్బందికి, పేదలకు, వర్కర్లకు ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి, గోరంటల రాజు, శిరుప మాధవ్కుమార్, ఆడెపు ప్రశాంత్, తాళ్లపల్లి శంకర్, నందీశ్వర్, ఈగ వినయ్కుమార్, త్రిమూర్తి పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు..
సుబేదారి : గ్రేటర్ 51వ డివిజన్లో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు భోజన వసతి కల్పించారు. రంజిత్రావు సొంత ఖర్ఛులతో భోజనం తయారు చేయించి వడ్డించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారని తెలిపారు.
యోగా గురువు ఆధ్వర్యంలో
మట్టెవాడ : వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో యోగా గురువు పోశాల శ్రీనివాస్ ఆహారం అందజేశారు. ఎంజీఎం సెంటర్, పోస్టాఫీస్, వరంగల్ చౌరస్తా, ఐ హాస్పిటల్, పాపయ్యపేట చమన్లో అందించారు. అదేవిధంగా వరంగల్ ఏవీవీ వాకర్స్, వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్ దినేశ్, ఏవీవీ కళాశాల వాచ్మన్ వెంకన్న, రాజేశ్వరి దంపతులకు బియ్యం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్, బరుపాటి గోపి, జంపన్న, చందర్, రవి పాల్గొన్నారు.
కాజీపేటలో నిరాశ్రయులకు..
కాజీపేట : సామాజిక వేత్త కాశీన లెనిన్బాబు ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాజీపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, టీఎస్సై, పోలీస్ సిబ్బంది, బరిగెల వినయ్, బోళ్ల రమేశ్, రవి, లక్ష్మీనాయణ పాల్గొన్నారు.