హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్లో వలస నేతలకు పదవుల పరంపర కొనసాగుతున్నదా? తాజాగా అసలు కాంగ్రెస్ నేతలకు మొండిచెయ్యి చూపించి, మరో వలస కాంగ్రెస్ నేతకు కీలక పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్గా కొనసాగుతున్న గద్వాల విజయలక్ష్మికి మరో సీటు సిద్ధం చేసి పెట్టినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నెల 16 తర్వాత ఎప్పుడైనా కీలక బాధ్యతలు చేపట్టవచ్చని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ పోస్టు ఖాళీగా ఉన్నది. కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద పదవీకాలం జనవరి 7న ముగిసింది. పార్టీ కోసం కష్టపడిన తనకు 14 నెలల పదవీకాలం మాత్రమే ఇచ్చారని, కాబట్టి మరోదఫా అవకాశం ఇవ్వాలని శారద తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, వీళ్లందరినీ పక్కనబెట్టి వలస కాంగ్రెస్ నాయకురాలికి ఈ పదవిని రిజర్వ్ చేసిపెట్టినట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈనెల 10న ఆమె పదవీకాలం ముగుస్తున్నది. దీంతో వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ని యమిస్తారని చెప్పుకుంటున్నారు. అందు కే కమిషన్ గడువు ముగిసి దాదాపు నాలు గు వారాలు గడుస్తున్నా ఇంతవరకు కొత్త చైర్పర్సన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదంటున్నారు. ఈ నెల 16న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఆమెకు పదవి కట్టబెడుతూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విజయలక్ష్మి 2021 ఫిబ్రవరి 11న బీఆర్ఎస్ పార్టీ తరఫున జీహెచ్ఎంసీ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేశవరావు కాంగ్రెస్లోకి వెళ్లినప్పుడు విజయలక్ష్మి కూడా పార్టీ ఫిరాయించింది.
సీనియర్లకు తీవ్ర అన్యాయం
మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని వలస కాంగ్రెస్ నేతలకు కట్టబెడతారన్న ప్రచారంతో అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కీలక పదవులన్నింటిలో వలస నేతలే తిష్ట వేస్తున్నారని ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనుల్లోనూ వలస నేతలకే ప్రాధాన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.