హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థను అంతా తప్పుపడుతున్నారని, ఆ ఇద్దరు వ్యక్తుల స్వార్థమే రాష్ర్టాన్ని కుదిపేస్తున్నదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. టీఎస్పీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై టీన్యూస్ చర్చలో పాల్గొన్న ఆయన.. మాజీ చైర్మన్గా తన అనుభవాలు, ప్రస్తుత తప్పిదానికి కారణమైన అంశాలపై మాట్లాడారు.. సర్వీస్ ప్రొవైడర్గా వచ్చిన రాజశేఖర్రెడ్డి అందరూ నమ్మేలా నటించాడని చెప్పారు. ప్రవీణ్ అనే వ్యక్తిని టీఎస్పీఎస్సీ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోలేదని, ఎక్కడో ఓ ప్రింటింగ్ ప్రెస్లో అతని తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద టీఎస్పీఎస్సీలో చేరి దురాగతానికి పాల్పడ్డాడన్నారు. తన హయాంలో ఎంతోమంది చేరినా, ఎవరూ తప్పు చేయలేదని చెప్పారు.
వేరే రాష్ర్టాల్లోనూ..
‘చాలా రాష్ర్టాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ అప్పుడు రిగ్గింగ్ జరిగినట్టే.. ఇప్పుడు పేపర్ లీకేజ్లు కామన్ అయ్యాయి. చివరికి ఆర్మీ, బ్యాంక్ ఉద్యోగాల పేపర్లు కూడా లీక్ అయ్యాయి. అది కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో. బీహార్లో వరుసగా 3 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అక్కడ నిర్వహణ లోపంతో ప్రింటింగ్ వద్ద, ఇన్విజిలేటర్ల వద్ద లీకేజీలు జరిగాయి. అయితే, తెలంగాణలో జరిగింది దొంగతనం. ఇద్దరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనంతో జరిగిన దొంగతనం. ఆ దొంగలను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేయడం గొప్ప విషయం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందున్న బాధ్యత ఒక్కటే.. ఇది పటిష్టమైన వ్యవస్థ అని నిరూపించాలి. కొన్ని వేల పేపర్లను తయారు చేసిన అనుభవం ఈ వ్యవస్థకు ఉన్నది. నిఘా లోపం వల్ల వ్యక్తులు చేసిన నేరం ఇది. ఇలాంటి వాటిని అరికట్టాలంటే అదనపు భద్రత, స్టాఫ్ కావాలని ప్రభుత్వాన్ని అడగొచ్చు. ఇలాంటి సంఘటనలు, దొంగతనం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని చక్రపాణి చెప్పారు.
చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం
పేపర్ లీకేజీ విచారణను మరింత వేగవంతం చేసి అభ్యర్థుల్లో భరోసా కల్పించాలని ప్రభుత్వానికి ఘంటా చక్రపాణి సూచించారు. లీకేజీకి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని, టీఎస్పీఎస్సీని పటిష్ఠం చేయాలని అన్నారు. ఇక, లీకేజీ ఘటనను రాజకీయ పక్షాలు రాజకీయాల కోసం వాడుకొంటున్నాయని, అభ్యర్థులను ఓటర్లుగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు చేయొద్దని, చదువులు ఆపేయాలని బండి సంజయ్ రెచ్చగొట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. అభ్యర్థులు కూడా టీఎస్పీఎస్సీకి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. పరీక్ష విధానంలో నెలలోపే సమూల మార్పులు వస్తాయని వెల్లడించారు.
పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు
2016లోనూ ఓ పరీక్షలో ఇదేవిధంగా జరిగినట్టు ఆరోపణలు చేస్తున్నారని, పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని ఘంటా చక్రపాణి హితవు చెప్పారు. ఏవైనా ఉంటే రుజువులతో రావాలని, తప్పు జరిగితే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టింది లక్ష ఉద్యోగాలే. నేనే ప్రత్యక్షంగా డ్రాఫ్టింగ్లో ఉన్నాను. కానీ ఇప్పుడు 2.40 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ఆశ్చర్యపోతున్నా. ఏ రాష్ట్రంలోనూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా చేయలేదు’ అని తెలిపారు.
మళ్లీ పరీక్షను అవకాశంగా తీసుకోండి
‘ఒకసారి రాసిన పరీక్ష రైద్దె, మళ్లీ పరీక్ష నిర్వహించడం అంటే ఎంపికైన అభ్యర్థులకు బాధగానే ఉంటుంది. కష్టపడి చదువుకున్న వాళ్లకు ఇది ఇబ్బందే. ఇలాంటి ఆరోపణల సమయంలో అభ్యర్థులకు కూడా మచ్చ పడుతుంది. కరోనా బ్యాచ్ అంటున్నట్టుగా, వాళ్లపై కూడా నింద పడుతుంది. ఆ మరకను తొలగించేందుకే పరీక్షను రద్దు చేశారు. దీన్ని మరో అవకాశంగా తీసుకోండి. కష్టపడి చదవండి. ఎంపికైనవాళ్లు వేలల్లో ఉంటే అనుమానాలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు 30 లక్షల మంది ఉన్నారు. వాళ్లకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది’ అని చక్రపాణి వివరించారు.
ఆరోపణలకు వివరణ
‘చాలామంది నా హయాంలోనే రాజశేఖర్రెడ్డి నియామకం జరిగిందని అంటున్నారు. అయితే, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాజశేఖర్కు సంబంధం లేదు. అతను ఏజెన్సీ వ్యక్తి. మా అవసరాల రీత్యా ఐదుగురు కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కావాలంటే అందులోంచి వచ్చిన ఒకడు రాజశేఖర్రెడ్డి. అంతే తప్ప.. అతన్ని నేను నియమించుకోలేదు. అతను అందరితోనూ కలిసిమెలిసి నటించడం వల్ల అనుమానించలేదేమో’ అంటూ ఆరోపణలను చక్రపాణి ఖండించారు.