కడ్తాల్ పంచాయతీ పాలక మండలి అమలు
కడ్తాల్, జూన్ 28: సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో జరిగే వివాహాలకు పంచాయతీ కార్యదర్శి ద్వారా వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంటారు. ఇకపై మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వచ్చే నవ దంపతులు పంచాయతీ పరిధిలోని పల్లెప్రకృతి వనంతోపాటు అనువైన స్థలాల్లో మొక్కలు నాటాలని పాలకవర్గం ఇటీవల తీర్మానించింది.
ఈ మేరకు మంగళవారం కడ్తాల్కు చెందిన ఎర్రమల మానస, నర్సింహ దంపతులు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం పంచాయతీకి రాగా.. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సూచన మేరకు వారు పల్లెప్రకృతి వనంలో రెండు మొక్కలు నాటిన అనంతరం సర్టిఫికెట్ పొందారు.