హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టానికి మరో ప్రపంచ ఇంజినీరింగ్ దిగ్గజ కంపెనీ రానున్నది. జర్మనీకి చెందిన బాష్ (బీవోఎస్సీహెచ్) సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో మూడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు బాష్ ప్రతినిధులతో మంగళవారం వర్చువల్గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అత్యుత్తమ నైపుణ్యంగల మానవ వనరులు, మౌలిక సదుపాయాలకు కొదవలేదని వారికి తెలిపారు. ఇక్కడి అవకాశాలతో చాలా కంపెనీలు ముందు ప్రకటించినదానికన్నా అధికంగా పెట్టుబడులు పెట్టి, మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయని చెప్పారు. బాష్ సైతం కంపెనీని విస్తరించడం ద్వారా మూడువేలకన్నా ఎక్కువమందిని నియమించుకొంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. బాష్ సంస్థ రాష్ర్టానికి రానుండటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం ట్విట్టర్లో వివరాలు వెల్లడించారు.
బాష్ సంస్థ మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, హోమ్ అప్లయెన్సెస్ తదితర రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదని చెప్పారు. హైదరాబాద్లో తన గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 1886లో జర్మనీలో ప్రారంభమైన బాష్ 1922లో భారత్లో అడుగుపెట్టింది. మొదట కోల్కతాలో కార్యకలాపాలు ప్రారంభించి, 1997లో బెంగళూరులో సాఫ్ట్వేర్, ఆర్అండ్డీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా హైదరాబాద్లో ఐటీ, ఇంజినీరింగ్, అర్అండ్డీ విభాగాల్లో మూడువేల మంది సిబ్బందితో కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ దార్శనిక నాయకత్వం, సమర్థ పరిపాలన, ప్రగతిశీల పురోగతి, పారిశ్రామిక అనుకూల విధానాలకు ఈ సంస్థ రాక మరో ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే బాష్ సంస్థ నగరంలో లాంఛనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నదని అధికారులు వెల్లడించారు. సమావేశంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఉపాధ్యక్షుడు, సెంటర్ హెడ్ కిరణ్ సుందర రామన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.