జిల్లాలవారీగా విడుదల చేసిన జీఎస్ఐ
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారత దేశంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ర్టాల్లో జిల్లాలవారీగా ఉన్న ఖనిజ వనరులు, భూగర్భజలాల వివరాలతో కూడిన మ్యాప్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అందుబాటులోకి తెచ్చింది. గనుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని జీఎస్ఐ దక్షిణ భారత ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ ఈ మ్యాప్లను విడుదల చేశారు.
డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్ (డీఆర్ఎం)లుగా పిలిచే వీటిలో తెలంగాణకు సంబంధించిన 6 జిల్లాల (హైదరాబాద్, పెద్దపల్లి, వనపర్తి, మెదక్, నాగర్కర్నూల్, కామారెడ్డి) మ్యాప్లు ఉన్నాయి.