మేడ్చల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను రాష్ట్రప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొంటున్నది. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యల్లో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో దేవాదాయ భూముల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వారంలో 22.05 ఎకరాల దేవాదాయ భూములను దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్వాధీనం చేసుకొన్న భూముల విలువ రూ.120 కోట్ల పైచిలుకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ భూముల్లో దేవాదాయశాఖ భూమిగా నిర్ధారిస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన లక్ష్మీనారాయణస్వామి దేవాలయానికి సంబంధించి 12.16 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా తొలకట్టలోని హన్మాన్ దేవాలయ భూములు 8.29 ఎకరాలు, నానక్రాంగూడ రంగనాథస్వామి దేవాలయానికి చెందిన 5.00 ఎకరాల భూములను స్వాధీనం చేసుకొన్నారు. నానక్రాంగూడ రంగనాథస్వామి దేవాలయానికి చెందిన భూమి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉన్నది. గుండ్లపోచంపల్లిలో స్వాధీనం చేసుకొన్న 12.16 ఎకరాల భూమికి ఎకరాకు సూమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల ధర పలుకుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల జియోట్యాగింగ్
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించి జియోట్యాగింగ్ చేశారు. మొత్తం 16,170.30 ఎకరాల దేవాదాయ భూమి ఉండగా ఇందులో 5,461 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకొంటున్నారు. ఆక్రమణలకు గురైన భూములపై 750 పైగా దేవాదాయశాఖ అధికారులు కేసులు వేశారు. ఆ కేసుల్లో గెలిచి ఇప్పటిదాకా 2,379.5 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకొన్నారు. మరో 3,082 ఎకరాలపై కేసులు నడుస్తున్నాయి. త్వరలోనే మిగతా భూములను కూడా స్వాధీనం చేసుకొంటామని అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 9,929.30, మేడ్చల్ జిల్లాలో 3,941.24, వికారాబాద్ జిల్లాలో 2,299.24 ఎకరాల దేవాదాయశాఖ భూములు ఉన్నాయి.