హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న సింగరేణికి అవార్డుల పంట పండింది. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. సోమ, మంగళ వారాల్లో ఒడిశాలోని భువనేశ్వర్లో 22వ జియోమైన్ టెక్ అంతర్జాతీయ సదస్సు జరిగింది. మానవ వనరుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యంత్రాల సమర్థ వినియోగం, పర్యావరణహిత చర్యలు, ఉత్పత్తిలో వృద్ధి, రక్షణ చర్యలు, కరోనా కట్టడికి తీసుకున్న చర్యలకు గాను సింగరేణికి విబ్జియార్ అవార్డును అందజేశారు.
కంపెనీ సీనియర్ డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు దక్కింది. సుమారుగా 13 వేల మొక్కలు నాటి, పర్యవేక్షిస్తున్న మరో డైరెక్టర్ బలరామ్కు ఎన్విరాన్మెంట్ ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఆధునిక యంత్రాలు- నిర్వహణ- రక్షణ అనే అంశంపై మైనింగ్ రంగ నిపుణులు తమ పత్రాలను సమర్పించారు. జియోమైన్ టెక్ కాన్ఫరెన్స్ సెక్రటరీ జయకుమార్ హోటా, సిమ్ ఫర్ మాజీ డైరెక్టర్, ధన్బాద్ ఐఐటీ చైర్మన్ బీడీ మిశ్రాలతోపాటు పలువురు ప్రముఖులు అవార్డులు అందజేశారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన నాల్గో, కోలిండియా, ఓఎన్జీసీ, వేదాంత, ఆర్సిలో మిట్టల్ తదితర 50కి పైగా కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.