వరంగల్లో జెన్ప్యాక్ట్ టెక్ సెంటర్ను ఏర్పాటుచేస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. టైర్ టూ నగరాల్లో ఐటీ రంగాన్ని వృద్ధిచేయాలన్న మా ప్రయత్నాలకు మద్దతునిస్తున్నందుకు జెన్ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్, ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు. టెక్ మహీంద్రా, సైయెంట్ల తర్వాత ఇప్పుడు జెన్ప్యాక్ట్ నిర్ణయంతో వరంగల్ వృద్ధి పథంలో దూసుకుపోతుంది.
–మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్ ఐటీ సిగలో మరో మణిహారం చేరనున్నది. ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ‘జెన్ప్యాక్ట్’ వరంగల్లో టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం జెన్ప్యాక్ట్ ప్రతినిధులు ప్రగతిభవన్లో ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావును కలిశారు. జెన్ప్యాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ వరంగల్ నగరానికి జెన్ప్యాక్ట్ను ఆహ్వానించారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు అద్భుతమైన కనెక్టివిటీ ఉన్నదని, ఉత్తమ విద్యాసంస్థలు అక్కడ కొలువై ఉన్నాయని చెప్పారు. వరంగల్ వంటి నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని హామీ ఇచ్చారు. టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందుకు జెన్ప్యాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్, ప్రతినిధి బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వరంగల్తోపాటు ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లోనూ ఐటీ టవర్లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. అక్కడ అనేక కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేటల్లోనూ ఐటీ టవర్ల పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.
తమ సంస్థకు వివిధ దేశాల్లో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు జెన్ప్యాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోచారం క్యాంపస్కు కేవలం గంటన్నర ప్రయాణ దూరంలోనే వరంగల్ క్యాంపస్ రానున్నదన్నారు. వరంగల్లో ఐటీ పరిశ్రమకు అనుకూలంగా ఉన్న ఎన్ఐటీ వంటి విద్యాసంస్థలతోపాటు అనేక ఇంజినీరింగ్ కాలేజీలను తాము పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ నగరంలోనూ అపారమైన, నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇది తమ కంపెనీకి ఒక కీలకమైన టెక్ సెంటర్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెన్ప్యాక్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విద్యా శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్ లీడర్ సతీశ్ వడ్లమణి, వైస్ ప్రెసిడెంట్, లీగల్ కౌన్సిల్ మధుబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఆర్వో అమర్నాథ్రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు కంపెనీలు వరుసగా ఏర్పాటుచేస్తున్న ప్లాంట్లు, సెంటర్లను చూసి కేటీఆర్ ఫాలోవర్ ఒకరు ఎంతో ఉత్సాహపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వాసినైన తాను పౌరసత్వాన్ని తెలంగాణకు మార్చుకోవాలనుకుంటున్నానని, దీనికి ప్రక్రియ ఏమిటో తెలియచేస్తారా సార్ అంటూ కేటీఆర్కు ట్వీట్ చేసారు.