హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : 20 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని నిరసనకు ఉపక్రమించిన బీఆర్ఎస్వీ, నిరుద్యోగ జేఏసీ నేతలపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండకు దిగడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఖండించారు. సోమవారం పోలీసు బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి అరెస్టు అయిన నిరుద్యోగ జేఏసీ నాయకులను బీసీ, ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్లు కిశోర్గౌడ్, విద్యాసాగర్, తుంగ బాలు, రఘురాం, హరిబాబుతో కలిసి నాంపల్లి పోలీస్స్టేషన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను నమ్మించిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత వారిని నిండా ముంచిందని మండిపడ్డారు.
నిరుద్యోగులకు మోసం: తుంగ బాలు
నాడు ఓట్ల కోసం నిరుద్యోగులకు వరాలు కురిపించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు ధ్వజమెత్తారు. హామీలను తుంగలో తొక్కిన రేవంత్కు పాలించే అర్హత లేదని తేల్చిచెప్పారు. నిండా ముంచిన కాంగ్రెస్కు ఘోరీ కట్టేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.